హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి ఫ్రైటర్ సర్వీసులను పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) డిమాండ్ చేసింది. క్యాథే పసిఫిక్, లుఫ్తాన్సా సరకు రవాణా సేవలను తిరిగి ప్రారంభించాలని ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు అనిల్ అగర్వాల్ తాజాగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరారు. హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన కార్గో ఉండటం వల్ల వస్తు,సేవల ధరలు తగ్గుతాయన్నారు.
ప్రపంచ మార్కెట్లను వేగంగా చేరుకోవడానికీ వీలు కలుగుతుందన్నారు. అయితే కొత్త నిబంధనల వల్ల తెలంగాణ నుంచి అంతర్జాతీయ మార్కెట్కు జరిగే ఎగుమతి, దిగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్నట్టు చెప్పారు. ఈ అడ్డంకులతో ఢిల్లీ, ముంబై నగరాల నుంచి రవాణా చేయాల్సి వస్తున్నదని తెలిపారు. ఈ పరిణామం పరిశ్రమలకు ఇబ్బందికరమన్న ఆందోళనను వ్యక్తం చేశారు. అమెరికా, ఐరోపా దేశాల వంటి ప్రధాన మార్కెట్లకు సరకు రవాణా ఖర్చులు ఎంతో పెరిగిపోయాయని.. ఆలస్యంతో వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు పాడైపోతున్నాయని తాము పంపిన ఓ రిప్రజెంటేషన్లో వెల్లడించారు.
ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు
జీఎమ్మార్ ఆధ్వర్యంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోమారు ‘నేషనల్ ఎనర్జీ లీడర్’, ‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్’ అవార్డులను దక్కించుకున్నది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ (జీబీసీ) నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ 23వ జాతీయ అవార్డుల్లో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను గెల్చుకున్నది. కాగా, ఎనర్జీ ఎఫీషియన్సీ సమ్మిట్ ఎడిషన్ సందర్భంగా సీఐఐ వీటిని ప్రకటించింది. నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డును గెలుచుకోవడం ఇది నాలుగోసారి అవగా, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్ అవార్డు రావడం ఆరోసారి.
ఇదిలావుంటే ఎయిర్పోర్టు చీఫ్ ప్రాజెక్ట్ అండ్ ఇంజినీరింగ్ ఆఫీసర్ విజయ్ రాథోడ్, ఏజీఎం (ఎలక్ట్రికల్) బిక్షం భూక్యా ఈ అవార్డులను అందుకున్నారు. గత మూడేండ్లలో సుస్థిరమైన ఇంధన సామర్థ్య చర్యలతో తన కార్యకలాపాల్లో సుమారు 5.41 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఎయిర్పోర్టు ఆదా చేసింది. దీనివల్ల సుమారు 4,426 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గాయి.