న్యూఢిల్లీ, మార్చి 3: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలతో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర ఆకాశాన్నంటుతోంది. గురువారం ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 118 డాలర్ల వద్దకు దూసుకుపోయింది. 100 డాలర్లస్థాయిని అధిగమించి, వారం తిరగకుండానే ఇది 18 శాతం పెరగడం గమనార్హం. ఇది తొమ్మిదేండ్ల గరిష్ఠస్థాయి. అలాగే అమెరికాలో అధికంగా వినియోగించే యూఎస్ వెస్ట్ టెక్సాస్ క్రూడ్ (లైట్ స్వీట్ క్రూడ్) ధర 11 ఏండ్ల గరిష్ఠం 114.70 డాలర్ల వద్దకు పెరిగింది. ఇండియాలోని మల్టీకమోడిటీ ఎక్సేంజ్లో క్రూడ్ ఫ్యూచర్స్ ధర బ్యారెల్కు 5 శాతంపైగా పెరిగి రూ.8,667 వద్దకు చేరింది. యుద్ధ ప్రభావంతో వ్యాపార అవరోధాలు, షిప్పింగ్ సమస్యలు ఏర్పడటం, పశ్చిమ దేశాలు రష్యాపై వరుసపెట్టి ఆంక్షలు విధిస్తుండటంతో చమురు ధర భగ్గుమంటున్నదని విశ్లేషకులు చెపుతున్నారు. పెరుగుతున్న ధరలకు అడ్డుకట్టవేసేదిశగా అత్యవసర చము రు నిల్వల నుంచి 6 కోట్ల బ్యారెళ్లను విడుదల చేయాలని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) నిర్ణయించినప్పటికీ, చమురు ర్యాలీ ఆగడం లేదు.
కొద్ది వారాల్లో 145 డాలర్ల స్థాయికి…
వచ్చే కొద్ది వారాల్లో బ్యారెల్ క్రూడ్ ధర 145 డాలర్ల స్థాయిని చేరుతుందని బ్రోకరేజ్ సంస్థ టీడీ సెక్యూరిటీస్ అంచనా వేసింది. ప్రస్తుత ఉక్రెయిన్ సంక్షోభంతో త్వరలోనే ఇది 125 డాలర్లస్థాయిని అందుకుంటుందని మోర్గాన్స్టాన్లీ అంచనాల్లో పేర్కొంది.