హైదరాబాద్ : ఇంకోర్ గ్రూప్కు చెందిన ఇంక్యుబేషన్ వెంచర్ అయిన బోస్టన్ లివింగ్.. హైదరాబాద్లోని జీఎమ్మార్ హైదరాబాద్ ఎరోసిటీలో రూ.250 కోట్ల భారీ బడ్జెట్తో ఓ కో-లివింగ్ ప్రాజెక్టును ( Co-living project ) అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు బోస్టన్ లివింగ్, జీఎమ్మార్ హైదరాబాద్ ఎరోసిటీ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందపై రెండు కంపెనీలు సంతకాలు చేశాయి. బోస్టన్ లివింగ్ తరఫున ఆ కంపెనీ డైరెక్టర్, సీవోవో ఆదిత్య సూర్నేని, జీఎమ్మార్ గ్రూప్ తరఫున ఎయిర్పోర్టు లాండ్ డెవలప్మెంట్ సీఈవో అమన్ కపూర్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా కో-లివింగ్, సర్వీస్డ్ రెసిడెన్స్లను నిర్మించనున్నారు. ప్రాజెక్టు కోసం మొత్తం రూ.250 కోట్లను ఖర్చు చేయనున్నారు. దశల వారీగా ఈ కో-లివింగ్ ప్రాజెక్ట్ కెపాసిటీని 1,500 పడకలకు పెంచనున్నారు. ఈ కొత్త ప్రాజెక్టుకు “ది లాండింగ్ బై బోస్టన్ లివింగ్” అని పేరుపెట్టనున్నారు. ఒప్పందంలో భాగంగా బోస్టన్ లివింగ్ కంపెనీకి జీఎమ్మార్ హైదరాబాద్ ఎరోసిటీ సంస్థ ఐదు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇవ్వాల్సి ఉంటుంది.
బోస్టన్ లివింగ్ డైరెక్టర్ ఆదిత్య సుర్నేని మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఇతర ప్రాజెక్టులలో ఒకటిగా ఈ కో-లివింగ్ ప్రాజెక్టు నిలువబోతున్నదని చెప్పారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం కల్లా పూర్తవుతుందని తాము అంచనా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కో-లివింగ్ ప్రాజెక్టులో ఉండేవారికి బోస్టన్ లివింగ్ సంస్థ భద్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించనుంది.
దేశంలో బోస్టన్ లివింగ్ కంపెనీకి చెందిన అతిపెద్ద సింగిల్ లొకేషన్ కో-లివింగ్ ప్రాజెక్టు హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్నది. ఈ కో-లివింగ్ ప్రాజెక్టులో 500 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ నిర్వహణే లక్ష్యంగా ఏర్పాటైన ఈ ఇంకోర్ సంస్థ.. తన మొదటి ప్రాజెక్టుగా PBEL సిటీ పేరుతో హైదరాబాద్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ను నిర్మించింది.