Yes Bank Scam | ప్రైవేట్ బ్యాంక్ ఫౌండర్ రాణా కపూర్ భార్య, ఇద్దరు కూతుళ్లకు బెయిల్ ఇవ్వడానికి బాంబే హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ప్రైవేట్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్పీఎల్)తో కలిసి అవినీతి, మోసపూరిత చర్యలు పాల్పడ్డారని వీరిపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాణా కపూర్ భార్య బిందు, కూతుళ్లు రోషిణి, రాధలకు జస్టిస్ భారతీ డాంగ్రే సారధ్యంలోని సింగిల్ బెంచ్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు.
అక్రమ కార్యకలాపాలతో యెస్ బ్యాంకుకు వీరు రూ.4000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. బెయిల్ నిరాకరిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు ఈ నెల 18న జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ బిందు, రోషిణి, రాధ గతవారం హైకోర్టును ఆశ్రయించారు.
దిగువ కోర్టు వీరికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మహిళలైనా వారు ఎటువంటి సానుభూతి పొందేందుకు అర్హులు కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం వారు ముంబైలోని బైకుల్లా మహిళా జైలులో ఉన్నారు.