న్యూఢిల్లీ, డిసెంబర్ 20: దేశీయ తొలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్కు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్స్టోన్ గుడ్బై చెప్పింది. స్టాక్ ఎక్సేంజీల్లో బ్లాక్ డీల్ ద్వారా ఎంబసీ రీట్లో తమకున్న మొత్తం 23.5 శాతం వాటాను దాదాపు రూ.7,100 కోట్లకు బ్లాక్స్టోన్ అమ్మేసినట్టు చెప్తున్నారు. ఒక్కో షేర్ను రూ.316 చొప్పున విక్రయించినట్టు సమాచారం.
ఈ లావాదేవీలో క్యాపిటల్ గ్రూప్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సహా దేశ, విదేశీ మదుపరులు పాల్గొని వాటాలు కొన్నారు. గ్లోబల్ ఫండ్ బ్లాక్స్టోన్, బెంగళూరుకు చెందిన రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూప్ కలిసి ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్ను తీసుకొచ్చాయి. 2019లో ఇది దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎక్కింది. ఐపీవో ద్వారా సుమారు రూ.5,000 కోట్లను సమీకరించారు. కాగా, గత ఏడాది ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్లో షేర్లను అమ్మి దాదాపు రూ.2,650 కోట్లను బ్లాక్స్టోన్ అందుకున్నది. దీంతో బ్లాక్స్టోన్ వాటా 32 శాతం నుంచి 24 శాతానికి దిగొచ్చింది.
ఇదిలావుంటే బెంగళూరు, ముంబై, పుణె, ఢిల్లీ-ఎన్సీఆర్లలో పలు ఆఫీస్ పార్కులు, సిటీసెంటర్ ఆఫీస్ బిల్డింగులు ఎంబసీ రీట్కున్నాయి. 45.3 మిలియన్ చదరపు అడుగుల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. వీటిలో కొన్ని ఎంబసీ రీట్కు సొంతమైతే, మరికొన్నింటిని లీజు ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఇక బ్లాక్స్టోన్కు దేశంలో రెండు ఆఫీస్ రీట్లున్నాయి. ఇప్పటికే మైండ్స్పేస్ రీట్కు గుడ్బై చెప్పిన బ్లాక్స్టోన్.. తాజాగా ఎంబసీ రీట్కూ టాటా చెప్పేసింది. అయితే రిటైల్ అసెట్స్ ఆధారిత రీట్ నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్కు బ్లాక్స్టోన్ స్పాన్సర్గా ఉన్నది. ఈ ఏడాదే ఇది లిస్టింగైంది.