లండన్: వరుసగా ఏడో సెషన్లోనూ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ దూకుడు కొనసాగింది. అంతకుముందు 56 వేల డాలర్ల వద్ద నిలిచిన బిట్ కాయిన్ విలువ గురువారం కొద్దిసేపు 58వేల డాలర్ల మధ్య ట్రేడయింది. గత 24 గంటల్లోనే బిట్ కాయిన్ రెండు శాతం బలపడటం ఆసక్తికర పరిణామం. చివరకు 57,500 డాలర్ల వద్ద ముగిసింది.
కరోనా మహమ్మారి నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజాన్నిచ్చేందుకు అధ్యక్షుడు జో బైడెన్ 1.9 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత రోజురోజుకు బిట్ కాయిన్ విలువ పెరిగి పోవడం గమనార్హం. గత నెల 21వ తేదీన 58 వేలు దాటిన బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల డాలర్లను దాటింది. తిరిగి గురువారం మరోసారి లక్ష కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. గత ఏడాది కాలంలో బిట్ కాయిన్ విలువ ఏడు రెట్లకు పైగా బబుల్ మాదిరిగా పెరిగిపోయింది.
కొన్ని నెలలుగా రెవెన్యూ కల్పిస్తున్న బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీలను నిర్లక్ష్యం చేయడం, తోసి రాజనడం కష్ట సాధ్యం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రోజురోజుకు బిట్ కాయిన్ విలువ పెరిగిపోతున్న నేపథ్యంలో దాన్ని నిషేధించడానికి బదులు ఇన్వెస్టర్లు, ఇతర వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు దాన్ని ఐటీ చట్టం నియంత్రణలోకి తేవాలన్న సూచలనలు వినిపిస్తున్నాయి.