Bitcoin | క్రిప్టో కరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ మళ్లీ పుంజుకున్నది. వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల ఆంక్షలు, ప్రభుత్వాల కఠిన నిర్ణయాలతో గతేడాది బిట్ కాయిన్ భారీగా పతనమైంది. తాజాగా బిట్ కాయిన్ విలువ 40 వేల డాలర్ల మార్కును దాటేసింది. గతేడాది మే తర్వాత బిట్ కాయిన్ పెరగడం ఇదే తొలిసారి. ఇక ముందు కీలక వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉండకపోవచ్చునని యూఎస్ ఫెడ్ రిజర్వు ప్రకటించింది. ద్రవ్యోల్బణం కూడా కాస్త దిగి రావడంతో వచ్చే ఏడాది వడ్డీరేట్లలో కోత విధిస్తామని కూడా పేర్కొనడంతో బిట్ కాయిన్ పుంజుకోవడానికి కారణమని తెలుస్తున్నది.
సింగపూర్ మార్కెట్లో సోమవారం క్రిప్టో మార్కెట్లో బిట్ కాయిన్ ఒక శాతం పెరిగి 40,005 డాలర్ల వద్ద ట్రేడయింది. చివరి సారి గతేడాది ఏప్రిల్లో అమెరికాలో బిట్ కాయిన్ విలువ 40 వేల డాలర్ల మార్కును దాటింది. బిట్కాయిన్ ఈటీఎఫ్లను ప్రారంభించడానికి బ్లాక్ రాక్ ఇంక్ దరఖాస్తు చేసుకున్నది. దీనికి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వచ్చేనెలలో ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నారు.
ఇంతకుముందు 2021 నవంబర్లో బిట్ కాయిన్ దాదాపు 69 వేల డాలర్ల మార్కుతో ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకున్నది. ఇంతకుముందు దివాళా తీసిన క్రిప్టో ఎక్స్చేంజ్ ‘ఎఫ్టీఎక్స్’ ఫౌండర్ శామ్ బ్యాంక్ మన్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. బైనాన్స్ ఫౌండర్ చాంగ్ పెంగ్ ఝావో పలు ఆరోపణలు ఎదుర్కోవడంతో క్రిప్టో పరిశ్రమ నుంచి వైదొలిగారు.