న్యూఢిల్లీ, జనవరి 5: స్విచ్లు, సాకెట్లు, కేబుల్స్ తదితర ఎలక్ట్రికల్ యాక్ససరీస్కూ నాణ్యతను తప్పనిసరిచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనల్ని విడుదల చేసింది. విదేశాల నుంచి దిగుమతవుతున్న నాసిరకం ఉత్పత్తులను అడ్డుకోవడం, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ క్వాలిటీ నియమావళిని తీసుకురాగా.. ఈ మేరకు ఈ నెల 1నే పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) ఎలక్ట్రికల్ యాక్ససరీస్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్ 2023ని జారీ చేసింది. జూలై 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానుండగా, వీటి ప్రకారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) మార్క్ లేని వస్తూత్పత్తులను తయారు చేసినా, అమ్మినా, దిగుమతి చేసుకున్నా, నిల్వ చేసుకున్నా నేరంగా పరిగణించనున్నారు.
ఎంఎస్ఎంఈల కోసం..
దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు ఈ నిబంధనల నుంచి కేంద్రం కొంత సడలింపునిచ్చింది. నిబంధనల అమలుకు ఎస్ఎంఈలకు అదనంగా 9 నెలలు, సూక్ష్మ సంస్థలకు ఏడాది సమయం ఇస్తున్నామని ఈ సందర్భంగా డీపీఐఐటీ తెలిపింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎస్ఎంఈలు, జూలై 1 నుంచి సూక్ష్మ సంస్థలు నిబంధనల్ని తప్పనిసరిగా అనుసరించాలి. ఆయా సంస్థల రక్షణార్థమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈలోగా ఎంఎస్ఎంఈలు తమ తయారీ వ్యవస్థల్ని అప్డేట్ చేసుకోవాలన్నది. ఆపై బీఐఎస్ మార్క్తోనే ఉత్పత్తి చేయాలని స్పష్టం చేసింది.
కఠిన శిక్షలు
బీఐఎస్ చట్టం నిబంధనల్ని తొలిసారి ఉల్లంఘించినట్టు గుర్తిస్తే.. రెండేండ్ల వరకు జైలుశిక్ష, కనీసం రూ.2 లక్షల జరిమానా ఉంటుంది. రెండోసారీ ఇదే నేరానికి పాల్పడినట్టు రుజువైతే.. జైలుశిక్షతోపాటు కనీసం రూ.5 లక్షల జరిమానా వేస్తారు. అలాగే గరిష్ఠంగా నిబంధనల్ని మీరి తయారు చేసిన వస్తూత్పత్తుల విలువకు 10 రెట్లు ఫైన్ వసూలు చేస్తారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు, వెల్డింగ్ రాడ్లు, ఎలక్ట్రోడ్స్, కుక్వేర్, సీలింగ్ ఫ్యాన్లు, వంట గ్యాస్ స్టౌవ్ల వంటి వాటికి ఈ నిబంధనల్ని తప్పనిసరి చేసిన సంగతి విదితమే.