లైఫ్ సైన్సెస్ హబ్గా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. రోగులకు నూతన థెరపీ పద్ధతిన చికిత్స అందిస్తుండటంతో వేగవంతంగా రికవరి అవుతున్నారు.
– మెడ్ట్రానిక్స్ చైర్మన్ జియోఫ్ మార్తా
హైదరాబాద్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నాలుగో పారిశ్రామిక విప్లవం(సీ4ఐఆర్)తో ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య సాంకేతికత రంగంలో సరికొత్త మైలురాయిని నిర్దేశిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న బయోఏషియా సదస్సులో భాగంగా బుధవారం జరిగిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం తెలంగాణ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్(సీ4ఐఆర్)ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధించినప్పటికీ, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని, దీనిని దృష్టిలో పెట్టుకొని వారికి మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
మరోవైపు, సీ4ఐఆర్ ద్వారా రాష్ట్రం మూడు ప్రధానమైన అంశాలపై దృష్టి సారించిందని, వీటిలో జీవనోపాధి, అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలను అందించడం, ప్రజలకు కచ్చితమైన వైద్య సదుపాయాలను కల్పించేందుకుగాను హెల్త్ ప్రొఫైలింగ్, క్లినికల్ రిజిస్ట్రీని రూపొందించడంతో త్వరితగతిన వైద్యాన్ని అందించేందుకు వీలు పడనున్నదన్నారు. అంతేకాకుండా ఆర్అండ్డీతోపాటు తయారీ, హెల్త్టెక్లో 10 వేలకు పైగా కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించడం, 20-25 కంపెనీలు, స్టార్టప్లను అభివృద్ధి చేయడం, విభిన్నమైన ఆలోచనలను రూపొందించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
లైఫ్ సైన్స్లో 50 వేల విద్యార్థులకు శిక్షణ
వచ్చే ఐదు నుంచి ఆరేండ్లలో రాష్ట్రంలో 50 వేల మంది పట్టభద్రులకు లైఫ్ సైన్స్ రంగంలో శిక్షణ ఇవ్వనున్నట్లు శ్రీధర్ బాబు ప్రకటించారు. లైఫ్ సైన్సెస్ రంగానికి భవిష్యత్తు ఉంటుందన్న అంచనాతో ముందుకు సాగుతున్నట్లు, త్వరలో పైలెట్ బ్యాచ్ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. రెండు ప్రత్యేక కోర్సులైన మెడికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ విభాగాల్లో క్లినికల్ రిజిస్ట్రీని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇక రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు బయో ఏషియా బుధవారంతో విజయవంతంగా ముగిసింది.