న్యూఢిల్లీ, జూలై 28: ప్రసిద్ధ ఇన్వెస్టరు రాకేష్ ఝున్ఝున్వాలా విమానయాన వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారు. మరింతమంది ప్రజలు విమానాల ద్వారా ప్రయాణిస్తారన్న విశ్వాసంతో ‘ఆకాశా ఎయిర్’ పేరుతో లోకాస్ట్ ఎయిర్లైన్ కంపెనీని ప్రారంభించబోతున్నానని, ఇందుకోసం వచ్చే నాలుగేళ్లలో 70 విమానాల్ని సమకూర్చుకోనున్నట్లు ఝున్ఝున్వాలా వెల్లడించారు. ఆయన బుధవారం బ్లూమ్బర్గ్ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కంపెనీలో 35 మిలియన్ డాలర్లు (రూ.260 కోట్లు) పెట్టుబడి చేసి, 40 శాతం వాటా తీసుకుంటానని చెప్పారు. తమ ఎయిర్లైన్స్కు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ వచ్చే 15 రోజుల్లో వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. 180 మందివరకూ ప్రయాణించగల విమానాల కోసం డెల్టా ఎయిర్లైన్స్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్తో సహా తమ బృందం అన్వేషిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఫోర్బ్స్ శ్రీమంతుల జాబితా ప్రకారం ఝున్ఝున్వాలా సంపద 4.6 బిలియన్ డాలర్లు (రూ.34,200 కోట్లు).