Adani Focus on Holcim | హోల్సిం ఇండియా యూనిట్ కొనుగోలుకు బిలియనీర్ గౌతం అదానీ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రెండు సంస్థల మధ్య చర్చలు అడ్వాన్స్ దశలో ఉన్నాయని తెలుస్తున్నది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్లో హోల్సిం కంట్రోలింగ్ వాటా కొనుగోలు కోసం జరిగే ఒప్పందంపై అదానీ గ్రూప్ సంతకం చేయనున్నదని ఈ అంశంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. జేఎస్డబ్ల్యూ గ్రూప్తోపాటు ఇతర బిడ్డర్లు కూడా హోల్సిం కొనుగోలు కోసం ఆసక్తి ఉన్నారని తెలుస్తున్నది. ఈ నెలలో అంబుజా షేర్లు 26 శాతం పెరుగడంతో మార్కెట్ క్యాపిటలైజేసన్ సుమారు 10 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఇందులో హోల్సిం వాటా 63.1 శాతం ఉంటుంది. అంబుజా అనుబంధ ఏసీసీ కూడా ఇందులో వాటాదారు.
ఇంకా తుది చర్చలు ప్రారంభం కాలేదని ఆయా సంస్థల అధికారులు చెప్పారు. హోల్సిం, జేఎస్డబ్ల్యూ గ్రూప్ ప్రతినిధులు స్పందించేందుకు నిరాకరించారు. అదానీ గ్రూప్, అంబుజా గ్రూప్ ప్రతినిధులు స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు. హోల్సిం ఇటీవలి కాలంలో నాన్కోర్ ఆస్తుల విక్రయాన్ని చేపట్టింది. గత సెప్టెంబర్లో బ్రెజిల్లోని తన యూనిట్ను 100 కోట్ల డాలర్లకు విక్రయించింది. జింబాబ్వేలో తన బిజినెస్ను విక్రయించడానికి ప్లాన్ రూపొందించింది.
31 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అంబుజా సిమెంట్స్ 1983లో స్థాపించారు. దేశంలో ఎనిమిది గ్రిల్లింగ్ యూనిట్లతోపాటు ఆరు మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లు కలిగి ఉంది. అదానీ గ్రూప్ అనుబంధ అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థకు రెండు సిమెంట్ అనుబంధ సంస్థలు ఉన్నాయి. అదానీ సిమెంటేషన్ అనే సంస్థ గుజరాత్లో సమగ్ర ప్లాంట్ నిర్మాణానికి ప్లాన్ వేసింది.