Bill Gates | హైదరాబాద్ : సరిగ్గా 25 ఏండ్ల క్రితం 1998లో తాను ప్రారంభించిన హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని సంస్థ అధినేత బిల్ గేట్స్ బుధవారం ఉదయం సందర్శించారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఐడీసీ కీలక పాత్ర పోషిస్తోంది. అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపిలాట్, ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్ అభివృద్ధి వెనుక ఐడీసీ కీ రోల్ ప్లే చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ల కోసం మైక్రోసాఫ్ట్ 365(మొబైల్) అప్లికేషన్లను తయారు చేయడంలో ఎంతో సహకారం అందించింది.
బిల్ గేట్స్ పర్యటన సందర్భంగా ఐడీసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. భవిష్యత్లో ఏఐ, క్లౌడ్, గేమింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో మైక్రోసాఫ్ట్ ఆవిష్కరణలకు ఐడీసీ కేంద్రం కానుందని తెలిపారు. ఐడీసీలో ఇంజినీర్లను ఉద్దేశించి బిల్ గేట్స్ చేసిన ప్రసంగం గొప్పదన్నారు. ఏఐ పవర్డ్ ఇండియాపై బిల్ గేట్స్ మరోసారి ఆశాభావం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
గతేడాది డిసెంబర్ 5వ తేదీన మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ 25 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వచ్చారు.