Bill Gates | మైక్రోసాఫ్ట్ ఎదుగుదలకు భారతీయులే కారణమని కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. జెరోడా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్ కాస్ట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్ విజయవంతం కావడంలో అనేకమంది అద్భుతమైన నిపుణులు ఉన్నారని, ఇందులో అత్యధికులు భారత్ నుంచి వచ్చిన వారేనన్నారు. భారతదేశంతో తనకు తొలి నుంచి మంచి అనుబంధమే ఉందని చెప్పారు.
మైక్రోసాఫ్ట్ స్థాపించాక భారత్లో నైపుణ్యమున్న పట్టభద్రులను ఎంపిక చేసుకుని నియమించుకున్నామని వెల్లడించారు. వారికి సియాటెల్లో విధులు అప్పగించామని.. వారంతా భారత్ తిరిగి వచ్చి మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపనలో కీలకపాత్ర పోషించారన్నారు. సత్య నాదెళ్ల సైతం భారత్ నుంచి వచ్చిన వారేనని, ఇప్పుడాయన మైక్రోసాఫ్ట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారన్నారు. ఐటీ రంగంలో తన కెరీర్ ప్రారంభంలో భారత్తో ఉన్న అనుబంధం ప్రస్తుతం కీలకంగా మారిందన్నారు.