హైదరాబాద్, నవంబర్ 28: యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ (సిడ్నీ ఐడీ) ఇనిస్టిట్యూట్తో భారతీయ వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం, హైదరాబాదీ ఔషధ రంగ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒప్పందం చేసుకున్నది. అడ్వాన్స్ వ్యాక్సిన్ రిసెర్చ్ కార్యక్రమాల కోసం, విద్యా-పారిశ్రామిక భాగస్వామ్యాల బలోపేతంతోపాటు అంటు రోగాల నివారణకు అంతర్జాతీయ స్థాయిలో చర్యలకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని మంగళవారం భారత్ బయోటెక్ తెలియజేసింది.
‘భవిష్యత్తులో సంభవించే అంటు వ్యాధులు, ఇతర ప్రాణాంతక రోగాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కావాల్సిన పద్ధతులు, చికిత్సల్ని కనిపెట్టాలనే ఔషధ రంగాన్ని మరింత పటిష్టం చేస్తూ సంస్థాగతేతర సహకారం కోసం యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ ఇనిస్టిట్యూట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం’ అని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.
‘భాగస్వామ్య పరిశోధనలు, వ్యాక్సిన్ తయారీలో నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడంలో ఈ ఒప్పందం మాకున్న చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తుంది’ అని సదరు ప్రకటనలో భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు. అలాగే తమ ప్రతిభను నిరూపించుకునేందుకు యువ శాస్త్రవేత్తలకూ దీన్నో గొప్ప అవకాశంగా అభివర్ణించారు.
‘భారత్ బయోటెక్తో మా కలయిక.. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో బలమైన ప్రభావాన్ని చూపగలదు. మానవ, జంతు సంబంధిత అంటువ్యాధుల నిర్మూలనకు సురక్షితమైన వ్యాక్సిన్ను సరసమైన ధరలకే అందించేందుకు కృషి చేస్తాం’ అని సిడ్నీ ఐడీ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ జామీ ట్రిక్కాస్ అన్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని అంతమొందించడంలో కీలకపాత్ర పోషించిన కోవాగ్జిన్ను భారత్ బయోటెక్ తయారు చేసిన విషయం తెలిసిందే. భారత్లో తయారైన ఈ వ్యాక్సిన్.. ఎంతో ప్రభావవంతంగా కోవిడ్-19 వైరస్పై పోరాడింది.