న్యూఢిల్లీ, నవంబర్ 2: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మరో రెండు మాడళ్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. వీటిలో నూతన ఎస్యూవీ జీఎల్ఈ రూ.96.4 లక్షల నుంచి రూ.1.15 కోట్లలో లభించనుండగా, రూ.98 లక్షల ప్రారంభ ధరతో ఏఎంజీ సీ 43 మాడల్ లభించనున్నది. కేవలం 4.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. వీటిలో జీఎల్ఈ మాడల్పై రెండేండ్ల సర్వీస్ ప్యాకేజ్ ధర రూ.85 వేలు, ఏఎంజీ సీ 43 మూడేండ్ల సర్వీస్ ప్యాకేజి కోసం రూ.1.5 లక్షల చార్జీ వసూలు చేస్తున్నది.
ప్రస్తుత సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి 10 మాడళ్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ఈ లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యార్ మాట్లాడుతూ..సరఫరా ఆందోళనలు ఉన్నప్పటికీ వచ్చే ఏడాది రికార్డు స్థాయి విక్రయాలు సాధిస్తామన్న ధీమాను వ్యక్తంచేశారు. దేశీయంగా లగ్జరీ కార్లకు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నదని, ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 12,768 యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు చెప్పారు. 2022లో అమ్ముడైన 15,822 యూనిట్ల కంటే ఈ ఏడాది రికార్డు వాహనాలను విక్రయించేదానిపై ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు. ఈవీలపై ఆయన స్పందిస్తూ మొత్తం వాహనాల్లో 4-5 శాతం వీటి వాటా ఉంటుందన్నారు.