న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్ లేదా భెల్)లో సర్కార్ వాటా విక్రయానికి సంస్థాగత మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. బుధవారం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో భాగంగా అమ్మకానికి పెట్టిన కంపెనీ షేర్లకు రెండింతలకు పైగా ఓవర్ సబ్స్క్రిప్షన్ దక్కింది. రూ.5,650 కోట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి.
తొలిరోజు 2.3 రెట్లు ఎక్కువగా బిడ్డింగ్ జరిగిందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి అరుణిష్ చావ్లా ‘ఎక్స్’ ద్వారా తెలిపారు. దీంతో ముందుగా అనుకున్న 3 శాతానికితోడు అదనంగా మరో 2 శాతం వాటానూ అమ్మేయనున్నట్టు చెప్పారు. దీంతో రూ.4,422 కోట్ల నిధులు సమకూరవచ్చని అంటున్నారు. షేర్ కనీస ధరను రూ.254 గా నిర్ణయించారు. ఇక గురువారం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ జరుగనున్నది.