Budget 2022 | బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి మొదలవుతాయి. తొలి విడుత సమావేశాలు వచ్చేనెల 11న ముగుస్తాయి. రెండో దఫా సమావేశాలు మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వచ్చేనెల ఒకటో తేదీన ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పిస్తారు. కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ తరుణంలో ఈ బడ్జెట్ రానుండడంతో వివిధ వర్గాలు పలు ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా ఆదాయం పన్ను చెల్లింపుదారుల్లో 64 శాతం పన్నుమినహాయింపు పరిమితి పెంచుతారని ఆశిస్తున్నారు. ప్రస్తుతం రూ.1.5 లక్షల వరకు ఉన్న రాయితీని రూ.2.5 లక్షలకు పెంచాలని కేపీఎంజీ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.
36 శాతం మంది మాత్రం ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పొందుతున్న రూ.1.5 లక్షల రాయితీని మరింత పెంచుతారని భావిస్తున్నారు. వేతన జీవుల స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేల నుంచి పెంచుతారని 19 శాతం మంది ఆశిస్తున్నారు. ఇంకా వర్క్ ఫ్రం హోం సంస్కృతి కొనసాగుతుండటంతో ఇంటర్నెట్ కనెక్షన్, ఫర్నీచర్ సహా ఇయర్ఫోన్స్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై పన్ను రాయితీ కల్పించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తేలింది.
దేశీయ కంపెనీలు చెల్లిస్తున్న కార్పొరేట్ పన్ను 30 నుంచి 22 శాతానికి కేంద్రం తగ్గించింది. విదేశీ కంపెనీలు 40 శాతం కార్పొరేట్ పన్ను చెల్లిస్తున్నాయి. ఈ వ్యత్యాసం భారీగా ఉందని, విదేశీ కార్పొరేట్ సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించి, వ్యత్యాసాన్ని కుదించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సర్వేలో 200 మంది ఆర్థిక నిపుణులు పాల్గొన్నారు.