నిర్మలా సీతారామన్
ముంబై, ఆగస్టు 25: దేశంలో రుణ వృద్ధిని పెంపొందించేందుకు బ్యాంకులు జిల్లాలవారీగా రుణ మేళాలు నిర్వహిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లతో బుధవారం ఆమె సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రుణాలకు డిమాండ్ లేదని ఇప్పుడే చెప్పలేమని, రుణ మేళాల ద్వారా అక్టోబర్లో రుణ వితరణ వేగం పుంజుకుంటుందని తెలిపారు.
రుణ వృద్ధి మందగించిన నేపథ్యంలో పరపతిని పెంచేందుకు 2019 సంవత్సరాంతంలో 400 జిల్లాల్లో బ్యాంకులు రుణ మేళాలు నిర్వహించాయని, 2019 అక్టోబర్-2021 మార్చి మధ్యకాలంలో బ్యాంకులు రూ.4.94 లక్షల కోట్ల రుణాల్ని పంపిణీ చేశాయని మంత్రి గుర్తుచేశారు. ఈ దఫా కూడా అక్టోబర్లో దేశంలోని ప్రతీ జిల్లాలో బ్యాంకులు రుణ మంజూరీ కార్యక్రమాల్ని నిర్వహిస్తాయని సీతారామన్ చెప్పారు.
కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల తరహాలో ప్రజల ముంగిట్లోకి వెళ్లి రుణాలివ్వాలని బ్యాంకులకు సూచించినట్లు ఆమె తెలిపారు. మరోవైపు ఎన్బీఎఫ్సీలు-ఎంఎఫ్ఐల ద్వారా రూ.1.5 లక్షల వరకూ రుణం ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందన్నారు. అలాగే జిల్లాస్థాయిలో ఎగుమతిదారులను ప్రోత్సహించాలని బ్యాంకుల్ని కోరినట్లు పేర్కొన్నారు.
బ్యాంకింగ్, బీమా నుంచి వైదొలగం
వ్యూహాత్మక రంగాలైన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీల్లో ప్రభుత్వం కనీసస్థాయిలో ఉనికిని కలిగివుంటుందని, వాటి నుంచి పూర్తిగా వైదొలగడం జరగదని ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్లో వ్యూహాత్మక రంగాలేమిటో ప్రస్తావించామని, ఆ పాలసీ ప్రకారం ఎల్ఐసీలోనూ, సాధారణ బీమా రంగంలోనూ, రీఇన్సూరెన్స్ రంగంలో కూడా ప్రభుత్వం వాటాలు ఉంటాయని ఆమె వివరించారు. బ్యాంకుల్లో కూడా కనీస ఉనికిని కలిగిఉంటూనే, వాటిని విలీనపర్చడమో లేదా డిజిన్వెస్ట్చేయడమో జరుగుతుందన్నారు.
ఒక జిల్లా-ఒక ఉత్పత్తి
దేశంలో ప్రతి జిల్లా నుంచి కనీసం ఒక ఉత్పత్తినైనా ఎగుమతి చేసే లక్ష్యంతో కేంద్రం ప్రతిపాదించిన ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ కార్యక్రమాన్ని విజయవంతంచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసిపనిచేయాలని బ్యాంకులను సీతారామన్ కోరారు. ఎగుమతిదార్ల అవసరాల్ని సమయానుగుణంగా తీర్చేందుకు ఎగుమతుల అభివృద్ధి ఏజెన్సీలు, పరిశ్రమతో చర్చించాలని బ్యాంకులకు సూచించినట్లు మంత్రి వివరించారు.
బ్యాంకు ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ పెంపు
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు చెల్లించే ఫ్యామిలీ పెన్షన్ను రూ.9,284 నుంచి రూ. 30,000-35,000కు పెంచుతున్నట్లు సీతారామన్ తెలిపారు. అలాగే నేషనల్ పెన్షన్ స్కీము (ఎన్పీఎస్) కింద ఉద్యోగుల పెన్షన్లకుగాను ప్రభుత్వ రంగ బ్యాంకులు గతంలో చెల్లించే 10 శాతాన్ని 14 శాతానికి పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకూ ఉన్న రూ.9,284 ఫ్యామిలీ పెన్షన్ పరిమితిని ఎత్తివేసి, పదవీ విరమణ సమయంలో అందుకున్న వేతనంలో 30 శాతం ఫ్యామిలీ పెన్షన్గా చెల్లించే పద్దతిని అమలులోకి తీసుకొస్తున్నట్లు ఫైనాన్షియల్ సర్వీసుల కార్యదర్శి దేబషిష్ పాండే వెల్లడించారు. దీంతో గరిష్ఠంగా రూ.35,000 వరకూ పెన్షన్ చెల్లింపు ఉంటుందని తెలిపారు.