న్యూఢిల్లీ, జూలై 4: పార్లమెంటు వర్షకాల సమావేశాలు జరిగినన్ని రోజులు 200 మంది రైతులు పార్లమెంటు వద్ద నిరసన తెలుపుతారని సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం ప్రకటించింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు జరుగుతాయని తెలిపింది. పార్లమెంటులోనూ నిరసన తెలుపాలని విపక్షాల ఎంపీలను కోరుతామని, సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు ఈ మేరకు వారికి లేఖ సమర్పిస్తామని తెలిపింది. చట్టాలపై చర్చ జరిగే వరకు సమావేశాలు జరగనివ్వద్దని కోరనున్నట్టు రైతు నేత బల్బీర్ సింగ్ చెప్పారు. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా, పెట్రోల్, డీజిల్, సిలిండర్ల ధరల పెరుగుదలపై సంయుక్త కిసాన్ మోర్చా ఈ నెల 8న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.