న్యూఢిల్లీ, ఆగస్టు 25: సామాన్య రుణగ్రహీతల నుంచి నయాపైసాతోసహా రాబట్టుకుంటున్న బ్యాంకులు.. కార్పొరేట్ అప్పుల్లో మాత్రం కోట్లాది రూపాయలను వదులుకుంటున్నాయి. ఓ తాజా నివేదిక ప్రకారం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్స్రీ కోడ్ (ఐబీసీ) కింద మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏలు) వసూలు కోసం చేసే ప్రతీ క్లెయిములో 69 శాతం నష్టపోవాల్సి వస్తున్నది. ఈ ఏడాది జూన్ 30నాటికి రూ.7.67 లక్షల కోట్ల విలువైన దాదాపు 517 ఐబీసీ కేసుల్లో బ్యాంకులు లేదా రుణదాతలకు వచ్చింది రూ.2.35 లక్షల కోట్లే. అంటే రూ.5.32 లక్షల కోట్లు పోయాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే సగటున ప్రతీ రూ.100లో రూ.69 కోల్పోవాల్సి వచ్చిందన్నమాట.
గత కొన్నేండ్లుగా దివాలా కేసుల్లో ఎంతోకొంత వస్తే చాలన్నట్టుగా బ్యాంకర్ల తీరు ఉన్నదని ఆర్థిక విశ్లేషకులు
విమర్శిస్తున్నారు. దీంతో క్లెయిముల్లో భారీ కోతలు పడుతున్నాయని వారు చెప్తున్నారు. చివరకు ఈ కేసులను
విచారిస్తున్న ఎన్సీఎల్టీ ధర్మాసనాలు సైతం ఎందుకింత తక్కువకు అంగీకరిస్తున్నారనీ బ్యాంకర్లను ప్రశ్నిస్తుండటం గమనార్హం. అయితే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రక్రియ (సీఐఆర్పీ) చాలా ఆలస్యమవుతుండటం వల్లే ఇలా చేస్తున్నామని బ్యాంకర్లు బదులిస్తున్నారు. అయినప్పటికీ దీనివల్ల నష్టపోయేవి బ్యాంకులే కదా అన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అలాగే కార్పొరేట్ రుణాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం పెరుగుతున్నదని, ఇదికూడా మొండి బకాయిలకు దారితీస్తున్నదంటున్నారు.
మొండి బకాయిల దెబ్బకు బ్యాంకుల లాభాలు ఆవిరైపోతున్నాయి. దేశంలోని మొత్తం 12 ప్రభుత్వ బ్యాంకులు ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దాదాపు రూ.15,306 కోట్ల లాభాలను ప్రకటించాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్-జూన్తో పోల్చితే 9.2 శాతం వృద్ధి నమోదైంది. అయినప్పటికీ బడా బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ల లాభాల్లో మాత్రం క్షీణత కనిపించింది. ఎన్పీఏల ఒత్తిడే దీనికి కారణమని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎస్బీఐ స్థూల నిరర్థక ఆస్తులు దాని మొత్తం రుణాల్లో 3.91 శాతంగా ఉన్నాయి.