RBI | న్యూఢిల్లీ, జూన్ 13: రుణాల్ని ఉద్దేశపూర్వకంగా ఎగవేసినవారితో రాజీ పరిష్కారం చేసుకోవాలని బ్యాంక్లకు రిజర్వ్బ్యాంక్ తాజాగా సూచించిన విధానాన్ని బ్యాంక్ యూనియన్లు దుమ్మెత్తిపోశాయి. ఇది బ్యాంకింగ్ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తుందని, ఎగవేతదార్లను సమర్థవంతంగా దారికి తీసుకొచ్చే చర్యలకు అవరోధంగా మారుతుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్లు విరుచుకుపడ్డాయి. ‘బ్యాంకింగ్ పరిశ్రమలో కీలకమైన భాగస్వాములుగా ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సమస్య పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎల్లప్పుడూ మేము కోరుతున్నాం. మోసపు, ఉద్దేశపూర్వక ఎగవేతగా వర్గీకరించిన ఖాతాలకు రాజీ పరిష్కారాన్ని అనుమతించడం న్యాయ సూత్రాల్ని ధిక్కరించడమే’ అంటూ యూనియన్లు తీవ్రంగా విమర్శించాయి. ఇది మోసపు రుణగ్రస్తుల్ని ప్రోత్సహించడమే కాకుండా, నిజాయితీపరులకు తప్పుడు సంకేతాలిచ్చినట్టవుతుందన్నాయి.
హఠాత్ మార్పు..మాకు షాక్
ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల రుణాల పునర్వ్యవస్థీకరణకు అనర్హమంటూ 2019 జూన్ 7నాటి ఆర్బీఐ ‘ప్రుడెన్షియల్ ఫ్రేమ్వర్క్ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్’లో స్పష్టం చేసింది. అలాంటిది ఇప్పుడు ఫ్రేమ్వర్క్లో ఏమిటీ హఠాత్ మార్పు? ఎగవేతదార్లకు రాజీ పరిష్కారాన్ని మంజూరు చేయడంతో మేము షాకయ్యామని యూనియన్లు వివరించాయి. దీంతో బ్యాంకింగ్పై ప్రజల విశ్వాసం, డిపాజిటర్ల నమ్మకం దెబ్బతింటుందని హెచ్చరించాయి. వ్యక్తులైనా, సంస్థలైనా ఇక మీదట రుణాల ఎగవేతనే ఎంచుకుంటాయని, బ్యాంకుల్ని, వాటి ఉద్యోగుల్ని నష్టాల్లో ముంచేస్తారన్నాయి. నిజాయితీ రుణగ్రస్తులు, డిపాజిటర్ల ప్రయోజనాల సంరక్షణకు ఈ రాజీ నిర్ణయాన్ని రిజర్వ్బ్యాంక్ ఉపసంహరించుకోవాలని యూనియన్లు డిమాండ్ చేశాయి.