హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో నిర్ధిష్టమైన కాంట్రాక్ట్ విధివిధానాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) జాతీయాధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకే దేశం-ఒకే పన్ను విధానం తరహాలో కామన్ కాంట్రాక్ట్ డాక్యుమెంట్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
బీఏఐ ఆధ్వర్యంలో శనివారం నుంచి ప్రారంభమయ్యే ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్ సదస్సు వివరాలను గురువారం ఇక్కడ న్యాక్ క్యాంపస్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన వెల్లడించారు. హైటెక్స్లో జరిగే ఈ 31వ జాతీయ సదస్సుకు భారీ ఏర్పాట్లు చేశామని, ఈ నెల 27 నుంచి 29 వరకు జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను సైతం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.
అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పర్యటించి కాంట్రాక్టర్ల సమస్యలను అధ్యయనం చేసినట్టుగా తెలిపారు. ఈ క్రమంలోనే టెండర్లు, బిల్లుల చెల్లింపుల విషయంలో నిర్ధిష్టమైన ప్రభుత్వ విధానం లేకపోవడమే ఈ రంగంలో సమస్యలకు కారణమని చెప్పారు. పనులు పూర్తి చేసిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. కాగా, సదస్సులో 800లకుపైగా ప్రతినిధులు పాల్గొననున్నారు.
నిర్మాణ రంగంలో అధునాతన టెక్నాలజీ, మెటీరియల్, నూతన పరికరాలపై అవగాహన, చర్చాగోష్ఠిలను చేపట్టనున్నారు. ప్రముఖులు, నిపుణుల ప్రసంగాలూ ఉంటాయి. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.25 తీసుకురావడంపై ఎస్ఎన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, కాంట్రాక్టర్లకు మధ్య బీఏఐ వారధిగా నిలుస్తుందని సదస్సు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బొల్లినేని శీనయ్య స్పష్టం చేశారు.
కాంట్రాక్టర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఏఐ రాష్ట్ర అధ్యక్షుడు కే దేవేందర్ రెడ్డితోపాటు కార్యదర్శి సచ్చిదానంద రెడ్డి, మెంబర్స్ కమిటీ చైర్మన్ డీవీఎన్ రెడ్డి, హైదరాబాద్ సెంటర్ చైర్మన్ భూపేందర్ సింగ్, వైస్ చైర్మన్ బల్మూరి సుగుణాకర్ రావు, కోశాధికారి నరేందర్ రెడ్డి, సంకినేని కృష్ణారావు, వి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.