న్యూఢిల్లీ: మొండి బకాయిలను వసూలు చేసేందుకు కేంద్రం ప్రతిపాదించిన నేషనల్ అసెట్ రీ కన్స్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) అలియాస్ బ్యాడ్ బ్యాంక్ త్వరలో ప్రారంభం కానున్నదా? అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందులోకి బదిలీ చేసేందుకు రూ.8,000 కోట్ల మొండి బాకీలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) గుర్తించింది. ఎన్ఏఆర్సీఎల్లో వాటా కొనుగోలు చేస్తామని పీఎన్బీ ఎండీ ఎస్ఎస్ మల్లిఖార్జున రావు శనివారం తెలిపారు.
ఎన్ఏఆర్సీఎల్లో ప్రభుత్వ బ్యాంకులకు 51% వాటా
అన్ని బ్యాంకుల తరఫున ఎన్ఏఆర్సీఎల్ ఏర్పాటవుతున్నదని మల్లిఖార్జున్ రావు తెలిపారు. రుణాల రికవరీకి అన్ని బ్యాంకులు తమ మొండి బకాయిలను ఎన్ఏఆర్సీఎల్కు బదిలీ చేస్తాయన్నారు. ఎస్బీఐ తర్వాత స్థానంలో పీఎన్బీ ఉంటుందన్నారు. ప్రతి బ్యాంకు పది శాతం లోపు వాటా కలిగి ఉంటాయి.
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాట్లు పూర్తి?
వచ్చే నెల నుంచి బ్యాడ్ బ్యాంక్ (ఎన్ఎఆర్సీఎల్) ప్రారంభం కావచ్చునని మల్లిఖార్జున్ రావు చెప్పారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని తెలిపారు.
మొత్తం మొండి బకాయిలు రూ.84 వేల కోట్లు
తొలి దశలో ఎన్ఏఆర్సీఎల్కు బదిలీ చేసేందుకు రూ.8000 కోట్ల మొండి బాకీలు గుర్తించామని మల్లిఖార్జున రావు వెల్లడించారు. మొత్తం మొండి బకాయిల విలువ రూ.84 వేల కోట్లని గుర్తించామని, వాటిని ఎన్ఏఆర్సీఎల్కు బదిలీ చేస్తామన్నారు. బ్యాడ్ బ్యాంక్కు సరిపడా నిధులు ఉన్నాయన్నారు.
ఫ్రాడ్ లోన్స్కు బ్యాడ్ బ్యాంక్ దూరం
ఫ్రాడ్ లోన్లను బ్యాడ్ బ్యాంకకు బదిలీ చేయొద్దని అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. గతేడాది మార్చి నెలాఖరు నాటికి రూ.1.9 లక్షల కోట్ల రుణాలు ఫ్రాడ్ లో న్స్ అని గుర్తించినట్లు తెలిపింది.