హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ప్రముఖ ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్.. ఫ్రాన్స్లో తయారవుతున్న అణు టర్బైన్లకు విడిభాగాలను సరఫరా చేసింది. ఇటువంటి పరికరాలను తయారుచేసి విదేశాలకు సరఫరా చేసిన కంపెనీ.. దేశంలో ఆజాద్ ఇంజినీరింగే కావడం విశేషం. ఫ్రెంచ్ న్యూక్లియర్ టర్బైన్లకు అవసరయ్యే కీలక భాగాలను సరఫరా చేసినట్టు ఆజాద్ ఇంజినీరింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్రాన్స్లోని బెల్ఫోర్ట్లో అణు టర్బైన్లను అసెంబుల్ చేసేందుకు ఉపయోగపడే ఈ భాగాల మొదటి సెట్ను డెలివరీ చేసినట్టు పేర్కొంది.
న్యూక్లియర్ టర్బైన్ల విడిభాగాల సరఫరాకు సంబంధించి ఫ్రాన్స్కు చెందిన జీఈ స్టీమ్ పవర్తో దీర్ఘకాల సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇందులో భాగంగానే మొదటి విడిభాగాల సెట్ను సరఫరా చేశామని సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది. జీఈ స్టీమ్ పవర్.. పవర్ ప్లాంట్ల కోసం కాలుష్యాన్ని తగ్గించే సాంకేతికతతోపాటు ఇతర సేవలను అందిస్తున్నది. కాగా, అణు విడిభాగాల తయారీకి ఆమోదం పొందిన మొదటి, ఏకైక కంపెనీ తమదే కావడం గర్వంగా ఉందని ఆజాద్ ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ చోప్దార్ అన్నారు.