న్యూఢిల్లీ, జనవరి 23: యాక్సిస్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.6,071 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,853 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం 4 శాతం పెరిగినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.26,798 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.33,516 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.
వీటిలో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.27,961 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.38 శాతం నుంచి 1.58 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 0.47 శాతం నుంచి 0.36 శాతానికి దిగొచ్చాయి. గత త్రైమాసికంలో బ్యాంక్ రూ.181.70 కోట్ల నిధులను మొండి బకాయిలను పూడ్చుకోవడానికి కేటాయించినట్లు తెలిపింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 9 శాతం పెరిగి రూ.12,532 కోట్లకు చేరుకోగా, ఎన్ఐఎం 4.01 శాతంగా ఉన్నది.