న్యూఢిల్లీ : దేశీయ ప్రైవేటు బ్యాంక్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్.. మరో ప్రైవేట్ బ్యాంక్ అయిన సిటీ బ్యాంక్ టేకోవర్ చేయనున్నది. ఈ విషయాన్ని సిటీ గ్రూప్ బుధవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ 1.6 బిలియన్ డాలర్ల వరకు ఉండనున్నది. క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, కన్స్యూమర్ లోన్లు కలిగి ఉన్న కన్స్యూమర్ బిజినెన్ విక్రయం ఉంటుందని సిటీగ్రూప్ తెలిపింది.
ఈ లావాదేవీల్లో సిటీ గ్రూప్నకు చెందిన నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, సిటీకార్ప్ ఫైన్సా (ఇండియా) లిమిటెడ్ కన్స్యూమర్ బిజినెస్తో పాటు వాణిజ్య వాహనాలు, నిర్మాణ సామగ్రి రుణాలు, అలాగే వ్యక్తిగత రుణాల పోర్ట్పోలియోలు సైతం ఉన్నాయని పేర్కొంది. అయితే, ఒప్పందం భారత్లోని సిటీ సంస్థాగత క్లయింట్ల బిజినెస్ను మినహాయించారు. అలాగే సిటీ బ్యాంక్ ఇండియా కన్స్యూమర్ బిజినెస్లో భాగంగా ఉన్న 3,600 మంది ఉద్యోగులు సైతం.. ప్రతిపాదిత లావాదేవీల ప్రక్రియ పూర్తయిన తర్వాత యాక్సిస్ బ్యాంక్కు బదిలీ అవుతారని సిటీ గ్రూప్ పేర్కొంది. ఈ సందర్భంగా సిటీ గ్రూప్ ఇండియా సీఈవో అషు ఖుల్లార్ మాట్లాడుతూ యాక్సిస్తో ఒప్పందం తమ సిబ్బందికి సానుకూల పరిణామమన్నారు.
వారి భవిష్యత్కు భద్రత కల్పించడం కంపెనీ ప్రాధాన్యం అన్నారు. యాక్సిస్తో ఒప్పందం ‘ముఖ్యమైన మైలురాయి’ అని సిటీ ఆసియా ఫసిఫిక్ సీఈవో పీటర్ బాబేజ్ పేర్కొన్నారు. అయితే, సింగపూర్, హాంకాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లండన్ లలో తమ బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో భారత్తో పాటు మరో 13 దేశాలలో కన్స్యూమర్ బిజినెస్ నుంచి నిష్క్రమించనున్నట్లు గత ఏడాది ఏప్రిల్లో సిటీ గ్రూప్ ప్రకటించిన విషయం తెలిసిందే.