Axis Bank Credit Card | గతంతో పోలిస్తే ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. మరోవైపు వివిధ సర్వీసులపై చార్జీలు పెంచేశాయి. కొన్ని క్రెడిట్ కార్డులపై రివార్డు పాయింట్లు, బెనిఫిట్లు తగ్గిస్తున్నాయి. ఆ జాబితాలోకి వచ్చి చేరింది యాక్సిస్ బ్యాంక్.. యాక్సిస్ బ్యాంక్ మ్యాగ్నస్, యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ క్రెడిట్ కార్డు యూజర్లకు గట్టి షాక్ ఇవ్వనున్నది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ రెండు కార్డుల యూజర్లకు కల్పించే బెనిఫిట్లు, రివార్డు పాయింట్లు తగ్గించబోతున్నట్లు ప్రకటించింది. అవేమిటో ఓ లుక్కేద్దాం..
సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి యాక్సిస్ బ్యాంక్ మ్యాగ్నస్ క్రెడిట్ కార్డు వాడకంపై నిబంధనలు, షరతుల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొన్ని సెలెక్టెడ్ ట్రాన్సాక్షన్లపై ఎడ్జ్ రివార్డు పాయింట్లు, వార్షిక ఫీజు మాఫీ వర్తించదు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రూ.లక్ష ఖర్చుపై 25 వేల ఎడ్జ్ రివార్డు పాయింట్లు ఉపసంహరిస్తున్నట్లు తెలిపింది. 2023 ఆగస్టులో వ్యయంపై నెలవారీగా లభించే 25 వేల ఎడ్జ్ రివార్డ్ పాయింట్లు.. అర్హులైన కస్టమర్లకు 90 రోజుల గడువులోపు లభిస్తాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రతి నెలా రూ.1.50 లక్ష ఖర్చు చేస్తే ప్రతి రూ.200పై 12 ఎడ్జ్ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. రూ.1.50 లక్షలకు పైగా ఖర్చు చేస్తే ప్రతి రూ.200పై 35 ఎడ్జ్ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.
ట్రావెల్ ఎడ్జ్ పోర్టల్ పై రూ.2 లక్షల స్పెండింగ్ చేస్తే ప్రతి రూ.200పై కస్టమర్లు 60 ఎడ్జ్ రివార్డు పాయింట్లు పొందుతాయి. హోటల్, ఎయిర్ లైన్ పాయింట్ల వద్ద రివార్డు పాయింట్ల కన్వర్షన్ నిష్పత్తి 5:4 నుంచి 5:2 కు తగ్గిస్తారు. ప్రతి ఐదు రివార్డు పాయింట్లకు నాలుగు ఎక్చ్చేంజ్ పాయింట్ల స్థానే రెండు పార్టనర్ పాయింట్లు లభిస్తాయి. 2023 సెప్టెంబర్-డిసెంబర్ మధ్య ఐదు లక్షల ఎడ్జ్ రివార్డు పాయింట్లను మాత్రమే కన్వర్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు మాఫీ నిబంధనను కూడా సవరించారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కస్టమర్లు ప్రతి ఏటా ఈ కార్డుపై రూ.25 లక్షలు ఖర్చు చేస్తేనే రూ.12,500 వార్షిక ఫీజు మాఫీ (2024 సెప్టెంబర్ నుంచి అమలు) అవుతుంది. 2023 సెప్టెంబర్ ఒకటో తేదీ లోపు మాత్రం రూ.15 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక ఫీజు మాఫీ వర్తిస్తుంది.
సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సెలెక్టెడ్ ట్రాన్సాక్షన్స్.. ఎడ్జ్ పాయింట్లు, వార్షిక ఫీజు మాఫీకి వర్తించవు. ప్రతి ఏటా ఐదు లక్షల ఎడ్జ్ పాయింట్లను మాత్రమే కన్వర్ట్ చేసుకునేందుకు అనుమతించారు. ఎయిర్ లైన్, హోటల్ ట్రాన్స్ పర్ పార్టనర్స్ వద్ద కార్డు వినియోగిస్తే వచ్చే రివార్డు పాయింట్ల కన్వర్షన్ నిష్పత్తి 5:4 నుంచి 5:2 శాతానికి తగ్గించారు. యాక్సిస్ బ్యాంక్ రిజర్వు క్రెడిట్ కార్డుపై ఏటా రూ.35 లక్షలకు ఖర్చు చేస్తేనే రూ.50 వేల వార్షిక ఫీజు మాఫీ అవుతుంది. ప్రస్తుత యూజర్లు ఈ ఏడాది వరకు రూ.35 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక ఫీజు మాఫీ చేస్తుంది.