న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ యాక్సిస్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.5,863 కోట్ల లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,329 కోట్లతో పోలిస్తే 10 శాతం అధికమని పేర్కొంది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి గత త్రైమాసికంలో బ్యాంక్ రూ.815 కోట్ల నిధులను వెచ్చించింది.
ఏడాది క్రితం కేటాయించిన రూ.550 కోట్ల కంటే భారీగా పెరిగాయి. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.24,094 కోట్ల నుంచి రూ.31,660 కోట్లకు పెరిగినట్టు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 19 శాతం ఎగబాకి రూ.12,315 కోట్లకు చేరుకున్నది. ఈ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరీ మాట్లాడుతూ..అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ మరింత బలోపేతం అవుతున్నదని, అలాగే ప్రస్తుత పండుగ సీజన్లో రుణాలకు డిమాండ్ ఉంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి బ్యాంక్ షేరు ధర స్వల్పంగా తగ్గి రూ.955.35 వద్ద ముగిసింది.