గురుగ్రామ్, సెప్టెంబర్ 9: హైదరాబాద్ రీజియన్ కార్యకలాపాలు ఈ ఏడాదే మొదలుకాగలవన్న ఆశాభావాన్ని శుక్రవారం క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) వ్యక్తం చేసింది. 2016లో ముంబైలో దేశీయంగా తమ తొలి రీజియన్ను ఏడబ్ల్యూఎస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో రీజియన్ను హైదరాబాద్లో తీసుకువస్తున్నది. దీన్ని ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తెస్తామన్న ధీమాను ఇక్కడ జరిగిన ఏడబ్ల్యూఎస్ సదస్సులో ఆ సంస్థ వరల్డ్వైడ్ పబ్లిక్ సెక్టార్ ఉపాధ్యక్షుడు మ్యాక్స్ పీటర్సన్ వెలిబుచ్చారు. ‘దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగ-ఉపాధి అవకాశాల కోసం 3.7 బిలియన్ డాలర్లకుపైగానే పెట్టుబడులు పెట్టాం. మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్లో ఏడబ్ల్యూఎస్ రీజియన్ను ప్రారంభించబోతున్నామని చెప్పడానికి ఎంతో సం తోషిస్తున్నాం’ అన్నారు. కాగా, హైదరాబాద్ ఏడబ్ల్యూఎస్ రీజియన్లో మూడు జోన్లు ఉంటాయని, ఒక్కో జోన్లో కనీసం రెండు డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని, ఈ ఏడాది ఆఖరుకల్లా కార్యకలాపాలు మొదలవుతాయని అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా రీజినల్ హెడ్ ఫర్ పబ్లిక్ సెక్టార్ రాహుల్ శర్మ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వంతో జట్టు
ఏడబ్ల్యూఎస్తో రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి ముందుకెళ్తున్నది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ, ప్రభావవంతమైన పౌర సేవలను మరింత వేగంగా అందించేందుకు తమతో కలిసి పనిచేస్తున్నట్టు ఏడబ్ల్యూఎస్ ఈ సందర్భంగా తెలియజేసింది. అలాగే ఈ-గవర్నెన్స్ను విస్తృతం చేసేందుకు ప్రస్తుత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)ఆధారిత పనిభారాన్ని క్లౌడ్ టెక్నాలజీకి రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానిస్తున్నదని సంస్థ వివరించింది. తద్వారా 33 శాఖలు, 289 సంస్థల ద్వారా మరింత వేగంగా విశ్వసనీయ పౌర సేవల్ని రాష్ట్ర ప్రజానీకానికి అందించాలని ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ‘ఈ-గవర్నెన్స్ సేవలకు ఆదరణ క్రమేణా పెరుగుతున్నది. దీనికి తగ్గట్టుగానే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పౌరుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ఈ-గవర్నెన్స్ సేవల్ని అందివ్వడానికి మేము కృషి చేస్తున్నాం’ అని ఏడబ్ల్యూఎస్ వర్గాలు చెప్పాయి.
‘అన్ని రకాల పౌర సేవలను రాష్ట్ర ప్రజలు సులువుగా అందుకునేలా ఆధునిక సాంకేతికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుంటున్నది. ఇందులోభాగంగానే ఏపీఐ, క్లౌడ్ కంప్యూటింగ్లకు పెద్దపీట వేస్తున్నది. మున్ముందు ఆస్తి పన్ను చెల్లింపు వంటి వాటిని మరింత వేగంగా పూర్తిచేయవచ్చు’
– జయేశ్ రంజన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి