హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : కొత్త వాహనాల్లో భద్రత ఫీచర్లపై వాహనదారులకు అవగాహన కలిగి ఉండాలని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కే పాపారావు అన్నారు. సోమవారం కొండాపూర్లోని వీవీఎస్ మోటర్స్ షో రూంలో ‘మహీంద్రా స్కార్పియో జెడ్ 8’ మోడల్ను ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ.. వాహన తయారీదారులు సేఫ్టీయే ప్రాధాన్యంగా సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటిస్తేనే సురక్షితంగా గమ్యం చేరుకోగలుగుతామన్నారు. వాహనాల కొనుగోలుదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని షోరూం యాజమాన్యానికి ఆయన సూచించారు.