న్యూఢిల్లీ: సులభతరంగా వ్యక్తిగత ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) చెల్లించడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ను ఇటీవలే ప్రారంభించింది. చాలా తేలికగా ఈ వెబ్సైట్తో పన్ను చెల్లింపు దారులు ఐటీఆర్ దాఖలు చేయడానికి పలు ఫీచర్లు జోడించింది.
విభిన్న పేమెంట్ ఆప్షన్లతో కూడిన ఫీచర్ వాటిల్లో ఒకటి. పన్ను చెల్లింపు దారులు నెట్ బ్యాంకింగ్, యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ), రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఆర్టీజీఎస్), క్రెడిట్ కార్డుల ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు.
ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకుల్లో నెట్బ్యాంకింగ్ ద్వారా పన్ను చెల్లింపుదారులు చెల్లింపులు జరుపవచ్చు. అత్యంత చిన్న ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ, సహకార బ్యాంకులకు అవకాశం కల్పించలేదు.
ఐటీ శాఖ సిస్టమ్లో బ్యాంకులను చేర్చకపోవడంతో ఇప్పటి వరకు పలువురు పన్ను చెల్లింపు దారులకు పన్ను చెల్లించడం చాలా కష్ట సాధ్యంగా మారింది. చార్టర్డ్ అకౌంటెంట్లు తమ క్లయింట్ల తరఫున ఐటీ రిటర్న్స్ చెల్లిస్తారు. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లించొచ్చు.
అయితే, ఐటీ చెల్లింపులకు క్రెడిట్ కార్డు ఒక ఆప్షన్. కానీ దాన్ని చివరి ఆప్షన్గా ఉపయోగించుకోవాలని పన్ను చెల్లింపుదారులకు నిపుణులు సూచించారు. క్రెడిట్ కార్డ్ చెల్లింపు ఒక కీలక ఫైనాన్సియల్ టాస్క్.
క్రెడిట్ కార్డు చెల్లింపు వల్ల అధిక వడ్డీ భారం భరించడంతోపాటు రుణాల బారిన పడి క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. ఒకవేళ క్రెడిట్ కార్డు ద్వారా పన్ను చెల్లిస్తే, సరైన టైంలో రీ పే చేయాలి.
సకాలంలో క్రెడిట్ కార్డు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెప్పారు. సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే ఆలస్యానికి లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
తదుపరి బిల్లు చెల్లింపు స్టేట్మెంట్లో లేట్ ఫీజు లేదా మిస్డ్ పేమెంట్స్ జత కలుస్తాయి. వడ్డీతోపాటు జీఎస్టీ కూడా యాడ్ అవుతుంది.
ఒకవేళ అడ్వాన్స్ టాక్స్ పేమెంట్ గడువును మిస్ అయితే ఒకశాతం పెనాల్టీ చెల్లించాలి. గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయకుంటే మరో ఒకశాతం పెనాల్టీ పే చేయాలి.