ATF Price Hike |విమాన ప్రయాణం కష్టం.. భారం కాబోతున్నది. ఆదివారం విమానాల్లో వాడే ఇంధనం.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర ఆదివారం 3.22 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఏటీఎఫ్ ధరలు వరుసగా పెంచడం ఇది తొమ్మిదో నెల. అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా ఏటీఎఫ్ ధరలు పెంచినట్లు కేంద్ర చమురు సంస్థలు నోటిఫికేషన్ జారీ చేశాయి. విమానాల్లో వాడే ఏటీఎఫ్ కిలో లీటర్పై రూ.3,649.13 (3.22 శాతం) పెంచడంతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.1,16,851.46 (లీటర్కు రూ.116.8)లకు చేరుకున్నది.
ఇదిలా ఉంటే వరుసగా 25వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. గత నెలలో చివరిసారిగా ఒకేసారి లీటర్ పెట్రోల్ లేదా లీటర్ డీజిల్పై రూ.10 పెంచాక మళ్లీ వాటి ధరలు పెంచలేదు. జెట్ ఫ్యూయల్ ధరలు ప్రతి నెలా ఒకటో తేదీ, 16న పెంచుతారు. అంతర్జాతీయ ధరలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజూ కేంద్ర చమురు సంస్థలు సవరిస్తుంటాయి.
ప్రస్తుతం ముంబైలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.1,15,617.24 కోల్కతాలో రూ.1,21,430.48, చెన్నైలో రూ.1,20,728.03 పలుకుతుంది. ఆయా రాష్ట్రాల వారీగా స్థానిక పన్నులను బట్టి ధరలు మారుతాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతుండటంతో ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. విమాన నిర్వహణలో 40 శాతం ఏటీఎఫ్ కొనుగోలుకే ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ధరలు పెంచడంతో ఏటీఎఫ్ ధరలు ఆల్టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి.