హైదరాబాద్, మే 25: అరబిందో ఫార్మా ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.909 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.508 కోట్లతో పోలిస్తే 79.6 శాతం ఎగబాకినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ. 6,473 కోట్ల నుంచి రూ.7,580 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.29 వేల కోట్ల ఆదాయంపై రూ.3,172 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయంలో అమెరికా నుంచి రూ.3,588 కోట్ల ఆదాయం సమకూరగా, యూరప్ నుంచి రూ.1,832 కోట్లు లభించాయి. అలాగే రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం రూ.392 కోట్ల నిధులు వెచ్చించింది. నూతన మార్కెట్లోకి అడుగుపెట్టడం, మార్కెట్లోకి పలు ఔషధాలను విడుదల చేయడం కలిసొచ్చిందని అరబిందో ఫార్మా వైస్-చైర్మన్, ఎండీ కే నిత్యానందా రెడ్డి తెలిపారు.