న్యూఢిల్లీ, మార్చి 21: హైదరాబాదీ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మాకు చెందిన ఇంజెక్ట్బుల్ వ్యాపారంలో ప్రధాన వాటాను గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ బ్లాక్స్టోన్ చేజిక్కించుకునే అవకాశాలున్నాయని ఈ లావాదేవీతో సంబంధమున్న పలు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వాటాను కొనుగోలు చేసేందుకు మూడు గ్లోబల్ ఫండ్స్..బ్లాక్స్టోన్, బేరింగ్స్ పీఈ ఆసియా, కేకేఆర్లు ఇప్పటికే అరబిందోతో చర్చలు జరిపాయని, బ్లాక్స్టోన్కు డీల్ ఖరారుకావొచ్చని ఆ వర్గాలు వివరించాయి. ఇంజెక్ట్బుల్ వ్యాపారాన్ని తన సబ్సిడరీ యుగియా ఫార్మా స్పెషాలిటీస్కు బదిలీ చేయాలని 2021 మే నెలలో అరబిందో ఫార్మా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇందులో మెజారిటీ వాటా విక్రయానికి వివిధ పీఈ ఫండ్స్తో చర్చలు జరుపుతున్నది. అరబిందో ఫార్మాకు ఉన్న మొత్తం ఇంజెక్ట్బుల్ వ్యాపారానికి 3.4-4 బిలియన్ డాలర్ల్ల (రూ.26,000-30,000 కోట్లు) విలువను ఈ డీల్కు అడ్వయిజర్గా వ్యవహరిస్తున్న కొటక్ మహీంద్రా క్యాపిటల్ నిర్దారించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
డీల్ తర్వాత డీమెర్జర్
ప్రధాన వాటా విక్రయం తర్వాత యూగియా ఫార్మా స్పెషాలిటీస్ను అరబిందో నుంచి వేరుపరుస్తారని, అదేరీతిలో లిస్టెడ్ కంపెనీ అయిన అరబిందో ఫార్మాను రెండుగా విభజిస్తారని విశ్లేషకులు చెపుతున్నారు. యూగియా డీమెర్జర్, పునర్వ్యవస్థీకరణ వంటి ప్రత్యామ్నాయలను అన్వేషించేందుకు అరబిందో ఫార్మా బోర్డు..స్వతంత్ర డైరెక్టర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఇటివల అరబిందో ఫార్మా సీఎఫ్వో సుబ్రమణియన్ తెలిపారు.