Audi India | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా వచ్చే ఏడాది (2023)లో విద్యుత్ వెహికల్స్ (ఈవీ)పైనే దృష్టి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇంటర్నేషనల్ కంబుస్టన్ ఇంజిన్ల (ఐసీఈ) తో కూడిన కార్ల తయారీని నిలిపివేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి ఎంటరైంది. దేశీయ మార్కెట్లో ఇతర కార్ల తయారీ సంస్థల కంటే అత్యధిక మోడల్ విద్యుత్ కార్లను ఆఫర్ చేసింది. ఆడీ ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ 2032 నాటికి ఐసీఈ కార్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ లోపే క్రమంగా విద్యుత్ కార్ల వైపు షిఫ్ట్ అవుతామని అన్నారు.
వచ్చే మూడేండ్లలో ప్రపంచవ్యాప్తంగా తమ కార్ల విక్రయాల్లో 15 శాతం విద్యుత్ వెహికల్స్ ఉండేలా లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు ఆడి ఇంతకుముందు ప్రకటించింది. అయితే, 2026 నుంచి తయారుచేసే నూతన తరం కార్లన్నీ ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంటాయని బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఒకవేళ ఆమోదయోగ్యమైన సంఖ్యలో గిరాకీ ఉంటే. భారత్లోనే ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) అసెంబ్లింగ్ ప్రారంభిస్తామన్నారు.
ఇటీవల పలు ఎలక్ట్రిక్ వెహికల్స్లో అగ్ని ప్రమాదాల నేపథ్యంలో తమ కార్లలో ఈవీ బ్యాటరీల సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తామని బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. తమ కంపెనీ కార్లలో బ్యాటరీ విడి భాగాలన్నీ వేర్వేరుగా తీసుకొచ్చి సుశిక్షితులైన నిపుణుల సమక్షంలో అసెంబ్లింగ్ చేస్తామన్నారు. గతేడాది ఈవీ కారును ఆవిష్కరించినప్పటి నుంచి ఆడీ ఇండియా సేల్స్ 2021లో 101 శాతం వృద్ధి నమోదైంది. గత ఆరు నెలల్లో 49 శాతం సేల్స్ పెరిగాయని ఆడీ ఇండియా తెలిపింది.