న్యూఢిల్లీ, ఆగస్టు 30: వైజాగ్ స్టీల్కు చెందిన 1,000 ఎకరాల విలువైన భూముల్ని అదానీ గ్రూప్కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పలు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అదానీ గ్రూప్నకు చెందిన గంగవరం పోర్ట్ లిమిటెడ్కు 1,000 ఎకరాలు లిజుకి ఇచ్చేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ)ను నిర్వహిస్తున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) చర్చలు జరుపుతున్నదన్న వార్తలపై మాజీ సీనియర్ అధికారి ఒకరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్గా వ్యవహరించిన ఈఏఎస్ శర్మ కేంద్ర ప్రభుత్వానికి వరుసగా రెండో లేఖ రాశారు. గత భూసేకరణ చట్టం కింద దశాబ్దాల క్రితం సేకరించిన భూముల్ని ఆర్ఐఎన్ఎల్ ఇవ్వజాలదని కేంద్ర ఉక్కు శాఖా కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ. 20,000 కోట్ల విలువైన ఆ 1,000 ఎకరాల భూముల్ని అదానీకి అప్పగించాలన్న లావాదేవీ వైజాగ్ స్టీల్ వృద్ధిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే గుప్పిట్లో 2 వేల ఎకరాలు
గంగవరం పోర్టు కోసం గత ప్రమోటర్, మరో ప్రైవేటు సంస్థకు 2,000 ఎకరాల్ని వీఎస్పీతో పంపకం చేశారని, ఆ ప్రమోటర్ నుంచి పారదర్శకత కొరవడిన లావాదేవీ ద్వారా రేవును అదానీ గ్రూప్ చేజిక్కించుకుందని శర్మ రాసిన తొలి లేఖలో వివరించారు. అప్పట్లోనే 2 వేల ఎకరాల విలువ రూ. 20,000 కోట్లని పేర్కొన్నారు. ఈ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 11 శాతం ఈక్విటీ వాటాను ఎటువంటి పోటీ బిడ్డింగ్ లేకుండా అదానీ గ్రూప్ తీసుకున్నదని తెలిపారు. ‘ఒక రకంగా చెప్పాలంటే ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి నుంచి అదానీ గ్రూప్ ఇప్పటికే బహుమతులు పొందింది’ అంటూ లేఖలో మాజీ ప్రభుత్వ అధికారి ఎత్తిచూపారు. శర్మ తొలిలేఖకు సిన్హా సమాధానమిస్తూ భూముల్ని గంగవరం పోర్టుకు ఇవ్వాలన్న ప్రతిపాదన గురించి తమ మంత్రిత్వ శాఖకు తెలియదని పేర్కొన్నారు.
చట్ట విరుద్ధం
సిన్హా లేఖకు బదులుగా శర్మ మరో లేఖ రాస్తూ ఆర్ఐఎన్ఎల్ భూముల్ని ఒక ప్రైవేటు కంపెనీకి (అదానీ గ్రూప్) అప్పగించే ఎటువంటి ప్రతిపాదన మంత్రిత్వ శాఖ వద్ద లేదన్నందుకు తాను సంతోషిస్తున్నానని తెలిపారు. తన ఆందోళనను ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం పరిగణనలోకి తీసుకుని, విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని ఏ ప్రైవేటు కంపెనీకైనా లీజుకిచ్చే చర్యల్ని అడ్డుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలా భూముల్ని ఇస్తే అది చట్ట విరుద్ధమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిల్లో వివిధ హోదాల్లో పనిచేసిన శర్మ రాసిన లేఖలో వివరించారు.