న్యూఢిల్లీ, ఆగస్టు 11: సబ్సిడీలకు, సంక్షేమాలకు మోదీ సర్కారు మంగళం పాడేస్తున్నది. ప్రజలపై భారం మోపుతూ పొదుపు మార్గాలను కత్తిరిస్తున్నది. చివరకు పెన్షన్ స్కీములనూ వదలట్లేదు. తాజాగా ట్యాక్స్ పేయర్లకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది మరి. సామాజిక భద్రత పథకం అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)కు ఆదాయం పన్ను (ఐటీ) చెల్లింపుదారులు అక్టోబర్ 1 నుంచి అర్హులు కాబోరని ప్రకటించింది.
‘ఆదాయం పన్నును చెల్లిస్తున్నవారెవరైనాసరే ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అటల్ పెన్షన్ యోజనలో చేరలేరు’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత పథకంలో చేరిన సబ్స్ర్కైబర్లు అప్పటికే లేదా అంతకుముందే ఐటీ పేయర్లని తేలితే వారి ఏపీవై ఖాతాను మూసేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నది.
అప్పటిదాకా వారు చెల్లించిన సొమ్మును తిరిగిచ్చేస్తామన్నది. ఐటీ చట్టం ప్రకారం రూ.2.5 లక్షల వరకే వార్షిక ఆదాయం ఉన్నవారు ఆదాయం పన్ను పరిధిలోకి రారు. దీంతో తాజా నిబంధనల ప్రకారం ఇక వీరికే ఏపీవై వర్తించనున్నది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం 18-40 ఏండ్ల వయసున్న భారత పౌరులెవరైనా ఏపీవైలో చేరవచ్చు. బ్యాంక్ లేదా పోస్టాఫీసుల్లోని తమ సేవింగ్స్ ఖాతాల ద్వారా ఈ పథకంలో సొమ్మును జమ చేయవచ్చు. కానీ అక్టోబర్ 1 నుంచి ఇన్కం ట్యాక్స్ పేయర్లకు అవకాశం ఉండదు. కాగా, 2015 జూన్-2016 మార్చి మధ్య ఈ స్కీంలో చేరిన అర్హులైన ప్రతీ సబ్స్ర్కైబర్కు ప్రభుత్వం ఓ ఆఫర్ను ప్రకటించింది.
ఇందులోభాగంగా 2015-16 నుంచి 2019-20 వరకు ఐదేండ్లపాటు మొత్తం చెల్లింపుల్లో 50 శాతం లేదా ఏటా రూ.1,000 (ఏది తక్కువగా ఉంటే అది) చొప్పున ప్రభుత్వం తరఫు నుంచి సబ్స్ర్కైబర్ ఏపీవై ఖాతాలో జమ అవుతుంది. ఐటీ పేయర్లు కానివారు, ఇతర సామాజిక భద్రత పథకాల్లో లేనివారికే ఇది వర్తిస్తుంది. 2015, జూన్ 1న మోదీ సర్కారు ఏపీవైని పరిచయం చేసిన విషయం తెలిసిందే.
ప్రధానంగా అసంఘటిత రంగంలోని కార్మికులనుద్దేశించి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో సబ్స్ర్కైబర్లకు వారు చెల్లించిన మొత్తాల ఆధారంగా 60 ఏండ్లు దాటిన తర్వాత నెలనెలా కనిష్ఠంగా రూ. 1,000, గరిష్ఠంగా 5,000 వరకు పెన్షన్ వస్తుంది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) కొత్తగా ఈ పథకంలో 99 లక్షల మందికిపైగా చేరారు. దీంతో ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి సబ్స్ర్కైబర్లు 4.01 కోట్లుగా ఉన్నారు.