గౌహతి, జూలై 18: ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ ముప్పును ఎదుర్కొంటున్నాయని అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం 55వ భారత బ్యాంక్ జాతీయీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో.. సర్కారీ బ్యాంకులపట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ బ్యాంకులదే కీలకపాత్రని, అయినప్పటికీ ప్రైవేటీకరించబడుతున్నాయని ఏఐబీవోసీ ప్రధాన కార్యదర్శి రూపం రాయ్ ఈ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
వ్యవసాయ, చిన్న, మధ్యతరహా సంస్థలు, విద్య, మౌలిక రంగాలకు ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయని, నేడు కోట్లాది మంది భారతీయులకు బ్యాంకింగ్ సేవలు చేరువయ్యాయంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే కారణమని గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాలను ఉపసంహరిస్తూ, విలీనాలు చేస్తూ పోతున్న విషయం తెలిసిందే. 1969 జూలై 19న ప్రభుత్వ బ్యాంకుల జాతీయీకరణ అమల్లోకి వచ్చింది. కాగా, బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదని, ఎస్బీఐలో 1,900 మంది ఖాతాదారులకు ఒక్క ఉద్యోగి చొప్పున ఉన్నారని రాయ్ తాజా ప్రకటనలో మండిపడ్డారు.