హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11(నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన విమానయాన సేవలను అందించే విమానాశ్రయాల్లో శంషాబాద్ ఎయిర్పోర్టు నిలిచింది. ప్రయాణికుల సంఖ్య, సిబ్బంది పనితీరు, ఆహ్లాదకరమైన వాతావరణం, పరిశుభ్రమైన పరిసరాలను పరిగణనలోకి తీసుకొని నిర్వహించిన రియల్ టైం సర్వేలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన విమానాశ్రయాల్లో జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ నిలిచిందని పేర్కొంది.
ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఇచ్చే ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాల్టీ(ఏఎస్క్యూ)లో మంచి స్కోరింగ్తో మరోసారి గుర్తింపు లభించింది. 2023 సంవత్సరానికిగాను ఆసియా-పసిఫిక్ ప్రాం తాల్లో 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణించే 400కి పైగా విమానాశ్రయాల్లో పనితీరు ఆధారంగా రూపొందించిన నివేదికలో హైదరాబాద్ విమానాశ్రయం అవార్డును సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది.
ప్రయాణికుల రాకపోకలు, సిబ్బంది పనితీరు, వసతులు వంటి 30కి పైగా అంశాలను ప్రామాణికంగా చేసుకొని నిర్వహించిన ఈ సర్వేలో మంచి స్కోరింగ్తో ఈ అవార్డును సొంతం చేసుకున్నట్లు, విమానాశ్రయం ద్వారా ప్రయాణించే వారికి మెరుగైన సేవలకు అధికప్రాధాన్యతనిస్తున్నట్లు జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్రదీప్ ఫణికర్ అన్నారు. మెరుగైన ఎయిర్పోర్టు మౌలిక వసతులు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించి విమానాశ్రయ సౌకర్యవంతమైన అనుభవాలను అందించడానికి సహకరిస్తుందన్నారు.