ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది అనే టైంలో మనలో చాలామంది ట్యాక్స్ తగ్గించుకోవడం గురించి ఆలోచించడం మొదలుపెడతారు. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరినవాళ్లు ఈ తప్పు ఎక్కువగా చేస్తారు. పిల్లల చదువులు, ఉన్నత చదువులు, సొంతిల్లు, రిటైర్మెంట్ ప్లానింగ్.. ఇలా ఎన్నో దశల కోసం మనం చేసే ప్రణాళికలో ట్యాక్స్ అనేది ఓ భాగం మాత్రమే. ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద కేవలం ట్యాక్స్ ఆదా చేయడం కోసమే రెండో ఇల్లు తీసుకోవడం, దీర్ఘకాల లాకిన్ పీరియడ్ ఉండే పోస్టాఫీస్ వంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టడం, యులిప్స్లో భారీగా నిధులు కుమ్మరించడం వంటివి చేయకూడదు. అందుకే మనం ఉద్యోగంలో చేరినప్పటి నుంచే మన దీర్ఘకాలిక లక్ష్యాలకు ఫైనాన్స్ను ముడిపెట్టి పెట్టుబడులను ప్రారంభించాలి. 30 శాతం శ్లాబుల్లో ఉన్నామని, ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోందని ఎడాపెడా పొదుపు చేస్తే మన ప్లానింగ్ అదుపు తప్పుతుందని అంతా గుర్తించుకోవాలి.
పీపీఎఫ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీములు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలు, గృహ రుణ అసలు మొత్తాలు, నేషనల్ పెన్షన్ స్కీం, సుకన్య సమృద్ధి యోజన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు, పోస్టాఫీస్-బ్యాంకులిచ్చే ఐదేండ్ల ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి వాటి ద్వారా పన్నులను ఆదా చేసుకోవచ్చు. మన అవసరాలు, రిస్క్ ఆధారంగా పరిగణనలోకి తీసుకుని పెట్టుబడులు పెట్టవచ్చు.
మార్కెట్ లింక్డ్ స్కీముల్లో సాధారణంగా కొద్ది ప్రిన్సిపుల్ రిస్క్ ఉన్నప్పటికీ రివార్డ్ కూడా అలానే ఉంటుంది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్లో వచ్చే కూపన్ రేటు (వడ్డీ) అంత గొప్పగా ఉండదని, వీటికి ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనేమీలేదు. అయితే పెద్దగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడనివాళ్లు, ప్రభుత్వ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీములు మంచి ఆప్షన్గా ఉంటాయి.
ఆదాయ పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 80సీలో భాగంగా మనం పన్ను రాయితీలను పొందవచ్చు. అలా పోస్టాఫీసుల్లోని పథకాల్లో కూడా పెట్టుబడి ద్వారా మనకు పన్ను ప్రయోజనాలు అందుతాయి. వీటిలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, టైమ్ డిపాజిట్ ఉన్నాయి. పీపీఎఫ్-ఈపీఎఫ్ సౌలభ్యం లేనివాళ్లు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది కూడా ఓ సురక్షిత పెట్టుబడి మార్గమేనని మదుపరులు మరువరాదు. పీపీఎఫ్లో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీరేటు వస్తోంది. ఇది మూడు విధాలుగా లాభపడే స్కీం. ఇందులో గరిష్ఠంగా పెట్టే పెట్టుబడి రూ.1.5 లక్షలకు రిబేట్తోపాటు దీనిపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం అన్నింటికీ పన్ను మినహాయింపే. సుకన్య సమృద్ధి యోజన.. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు బాగా ఉపయోగపడే పథకం. అయితే పదేండ్లలోపు పిల్లలుంటేనే అర్హులు. బాలికకు 18 ఏండ్లు వచ్చేంతవరకూ ఈ పథకంలో కొనసాగవచ్చు. ఇద్దరు, ముగ్గురు ఆడపిల్లలున్నా ఈ పథకంలో చేరవచ్చు. ఈ స్కీం కింద ప్రస్తుతం 7.6 శాతం వడ్డీరేటు లభిస్తోంది. ఏడాదికి కనిష్ఠంగా రూ.250, గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకూ ఇందులో పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టే పెట్టుబడుల్లో రూ.1.5 లక్షల వరకూ సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులను పొందవచ్చు.
-నాగేంద్ర సాయి కుందవరం
60 ఏండ్లకు పైబడినవాళ్లు ఈ స్కీముకు అర్హులు. 55 నుంచి 60 ఏండ్లలోపు రిటైరై, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకున్న నెల రోజులలోపు పెట్టుబడులు పెట్టాలి. కనిష్ఠంగా రూ.1000, గరిష్ఠంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. 3 నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. వడ్డీ ఏడాదికి రూ.50వేలు దాటితే టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. దాన్ని మళ్లీ క్లెయిం చేసుకోవచ్చు. భార్య లేదా భర్తతో కలిసి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకునే సౌలభ్యం ఉన్నది. క్రమం తప్పకుండా స్థిరమైన వడ్డీ ఆశించేవారికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. మెచ్యూరిటీ వరకూ ఈ స్కీంపై 8 శాతం వడ్డీ స్థిరంగా వస్తుంది.
కనిష్ఠంగా రూ.1,000, గరిష్ఠంగా ఎంతైనా ఈ నేషనల్ సర్టిఫికెట్స్లో మదుపరులు పొదుపు చేసుకోవచ్చు. అయితే డిపాజిట్ చేసిన రోజు నుంచి ఐదేండ్లకు ఇది మెచ్యూరిటీ అవుతుంది. ఈ సర్టిఫికెట్లపై 7 శాతం వరకూ వడ్డీ పొందవచ్చు. నిజానికి ప్రస్తుత మార్కెట్తో పోల్చితే కొంత తక్కువగా అనిపించినా ఇది సురక్షితమైన పెట్టుబడి సాధనమన్నది మదుపరులు గుర్తుంచుకోవాలి. ఇక ఏడాదికి ఒక్కసారి మాత్రమే వీటిల్లో వడ్డీ చెల్లింపు ఉంటుంది. అవసరాన్నిబట్టి ఈ సర్టిఫికెట్లను తనఖా పెట్టి రుణాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ పథకానికి సైతం ఆదాయ పన్ను రాయితీలను పొందవచ్చు. వీటితోపాటు ఐదేండ్ల పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్ కూడా ఇలాంటి ప్రయోజనాలనే ఇస్తున్నదిప్పుడు.