వాషింగ్టన్: ఆపిల్ సంస్థ ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోంది. ఓ స్టూడెంట్కు ఏకంగా రూ.36 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఆ సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసిన పనే దీనికి కారణం. తమ దగ్గరికి రిపేర్ కోసం వచ్చిన ఐఫోన్లో ఉన్న నగ్న ఫొటోలు, సెక్స్ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఆ వ్యక్తులు. ఆ ఫొటోలు, వీడియోలు ఆ ఫోన్ రిపేర్ కోసం ఇచ్చిన అమ్మాయివే. అదే కాకుండా వాటిని ఆమె సోషల్ మీడియా అకౌంట్లోనే పోస్ట్ చేశారు. ఇది జరిగింది 2016లో. అప్పుడే ఆపిల్ సంస్థపై సదరు అమ్మాయి పరువు నష్టం దావా వేసింది.
ఫోన్ రిపేర్ చేసిన తర్వాత అందులో ఆమెకు సంబంధించిన 10 ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు. వాటిని చూసిన ఆమె ఫ్రెండ్స్ విషయం చెప్పడంతో వెంటనే డిలీట్ చేసింది. అయితే ఇది తీవ్రమైన ప్రైవసీ ఉల్లంఘన కిందికి రావడంతో సంస్థపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించింది. ఆమెకు నష్ట పరిహారంగా 50 లక్షల డాలర్లు (సుమారు రూ.36 కోట్లు) చెల్లించాలని ఆమె తరఫు లాయర్లు డిమాండ్ చేశారు. దీంతో ఇప్పుడు ఆపిల్ సంస్థ దిగి వచ్చి ఆ మొత్తం చెల్లించడానికి సిద్ధపడింది.