న్యూయార్క్, నవంబర్ 2: నాలుగు దశాబ్దాల గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే క్రమంలో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వరుసగా నాల్గోసారి 75 బేసిస్ పాయింట్ల (0.75 శాతం) మేర వడ్డీ రేట్లను పెంచింది. బుధవారం సమీక్షలో తీసుకున్న నిర్ణయంతో ఫెడ్ ఫండ్స్ రేటు 3.75-4 శాతానికి చేరింది. జూన్ నుంచి ఇప్పటివరకూ నాలుగు దఫాలు 0.75 శాతం చొప్పున రేట్లను పెంచింది. వచ్చే డిసెంబర్ సమీక్షలో మరో 0.50 శాతం, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి సమీక్షల్లో 0.25 శాతం చొప్పున పెంపు ఉంటుందన్న అంచనాలున్నాయి. దీంతో మార్చికల్లా ఫెడ్ ఫండ్స్ రేటు 5 శాతానికి చేరే అవకాశం ఉంది.
ఫెడ్ సమీక్ష నేపథ్యంలో గురువారం ఆర్బీఐ పాలసీ కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహి స్తున్నది. షెడ్యూల్ ప్రకారం కమిటీ సమావేశం డిసెంబర్లో జరగాల్సి ఉండగా, ఈ నెల 3నే సమావేశం కానున్నట్టు ఆర్బీఐ ప్రకటించినది తెలిసిందే. అయితే ఈ సమీక్షలో రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటారా? లేక ద్రవ్యోల్బణం లక్ష్యం నెరవేరకపోవడంపై కేంద్ర ప్రభుత్వానికి రాసే సంజాయిషీ లేఖపై కసరత్తు చేస్తారా? అన్నది వెల్లడి కాలేదు.