హైదరాబాద్,జూలై 20(నమస్తే తెలంగాణ): టీ-హబ్ వేదికగా ఆవిర్భవించిన మరో టెక్నాలజీ స్టార్టప్ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నది. ఇప్పటికే అంతరిక్షంలోకి రాకెట్ను విజయవంతంగా పంపించి తనదైన ముద్రవేసిన స్కైరూట్ సరసన మరో డీప్-టెక్ స్టార్టప్ జోధ్యా చేరింది. ప్రపంచ ఇంధన సంక్షోభానికి చెక్పెడుతూ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందిన ఈ స్టార్టప్ సంస్థ. ఇందుకుగాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రశంసల జల్లుకురిపించారు. ‘చిన్న చిన్న అడుగులు రేపటికోసం పెద్ద మార్పును తీసుకువస్తాయనే నినాదంతో పనిచేస్తున్న జోధ్యా టీమ్ను ఆయన అభినందనలు తెలియచేశారు.
ఇప్పటి వరకు వేల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సఫలీకృతమైందని..ఐఐటీ మద్రాస్ నుంచి టీ-హబ్ వరకు వీరి ప్రయాణం, యువ పారిశ్రామికవేత్తలకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన శ్లాఘించారు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని అధిగమించే దిశగా జోధ్యా అడుగులు వేస్తున్నదని, ముఖ్యంగా పర్యావరణానికి భరోసా కల్పిస్తూ అందుబాటులోకి వచ్చిన ఈ ప్రాజెక్టు తమ హయంలో రూపుదిద్దుకోవడం ఐటీ రంగం పట్ల తమ చిత్తశుద్దికి నిదర్శనమన్నారు.
ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులు రోహిత్ పల్లెర్ల, శరత్ మణి చినశెట్టి స్థాపించిన జోధ్యా… వాణిజ్య భవనాలు, పరిశ్రమల్లో ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు కృత్రిమ మేధస్సు(ఏఐ) ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నది. సంస్థ అభివృద్ధి చేసిన సేవర్ ఎక్స్ వంటి పరికరాలు, ఇప్పటికే ఉన్న విద్యుత్ వ్యవస్థలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుసంధానించుకోవచ్చును. ఈ పరికరాలు రియల్ టైమ్లో డాటాను విశ్లేషించి, ఇంధన వృథాను అరికట్టడంలో సహాయపడుతున్నది.
హైదరాబాద్ కేంద్రంగా ప్రస్థానాన్ని ప్రారంభించిన జోధ్యా..అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా అమెరికా, ఆగ్నేసియా, మధ్యప్రాచ్యం, యూరోపియన్ దేశాల్లో తన సేవలను విస్తరించింది. దేశీయంగా ఉన్న మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవడంతోపాటు గ్లోబల్గా క్లయింట్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు వేగవంతం చేసింది. పెద్ద పెద్ద మాల్స్, ఆసుపత్రులు, కార్పొరేట్ కార్యాలయాల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తున్నది. మరోవైపు పలు అవార్డులను సైతం దక్కించుకున్నది. 2023 హైసియా అవార్డుల్లోనూ సత్తా చాటింది.
