హైదరాబాద్, జనవరి 19: హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో భారీ లావాదేవీ జరిగింది. సెమీ-కండక్టర్ దిగ్గజం అమెరికాకు చెందిన మైక్రోచిప్ టెక్నాలజీ పెద్ద ఎత్తున ఆఫీస్ స్పేస్ను సొంతం చేసుకున్నది. కోకాపేట్ బిజినెస్ డిస్ట్రిక్ట్లోగల ఏ-గ్రేడ్ కమర్షియల్ టవర్ ‘వన్ గోల్డెన్ మైల్’లో 1.68 లక్షల చదరపు అడుగుల్లో ఐటీ స్పేస్ను దక్కించుకున్నది.
ఈ డీల్ విలువ రూ.175 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తున్నది. లావాదేవీకి కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సలహాదారుగా వ్యవహరించినట్టు వన్ గోల్డెన్ మైల్ వర్గాలు తెలియజేశాయి. అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు ఇప్పుడు కోకాపేట్ ప్రాంతం.. హాట్ కేక్గా ఉన్న విషయం తెలిసిందే. దీంతో తాజా లావాదేవీ ఇక్కడి డిమాండ్ను మరింత పెంచినైట్టెంది. ‘హైదరాబాద్లో కమర్షియల్ ఆఫీస్ విభాగంలో నెలకొన్న డిమాండ్కు ఈ డీల్ అద్దం పడుతున్నది. అన్ని హంగులతో, అధునాతన సౌకర్యాలు, సకల సదుపాయాలను కలిగి ఉండటం ఇక్కడి ఆఫీస్ స్పేస్ మార్కెట్కు కలిసొస్తున్నది.
ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల్లోనూ హైదరాబాద్ మార్కెట్ హవా కొనసాగుతుండటం విశేషం’ అని పలువురు సెమీ-కండక్టర్ పరిశ్రమ విశ్లేషకులు అంటున్నారు. కాగా, మైక్రోచిప్ టెక్నాలజీకి హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నైల్లో డెవలప్మెంట్ సెంటర్లున్నాయి. తాజా ఆఫీస్ స్పేస్తో వచ్చే 10 ఏండ్ల విస్తరణకు సంస్థ ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నది. ఇక వన్ గోల్డెన్ మైల్ అనేది ఉరియన్, ఎస్కర్, టెర్మినస్ కలిసి ప్రమోట్ చేస్తున్న ఓ ప్రీమియం కమర్షియల్ ప్రాపర్టీ. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని తెచ్చారు.