న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: అన్లిస్టెడ్ స్టార్టప్ సంస్థలు షేర్ల జారీ ద్వారా స్వీకరించే మూలధన లాభాలపై విధించే ‘ఏంజిల్ ట్యాక్స్’కు సంబంధించి కొత్త నిబంధనల్ని ఆదాయపు పన్ను శాఖ తాజాగా నోటీఫై చేసింది. స్టార్టప్లు జారీచేసే షేర్ల సరసమైన మార్కెట్ విలువకు మించి సమకూరే ప్రీమియంపై విధించే పన్నును ఏంజిల్ ట్యాక్స్గా వ్యవహరిస్తారు. ఈ పన్ను ఇప్పటివరకూ దేశీయ ఇన్వెస్టర్లకే వర్తించేది. విదేశీ పెట్టుబడులకు కూడా దీనిని విస్తరిస్తూ 2023-24 బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన ప్రకారం షేర్ల జారీతో అధికంగా వచ్చే ప్రీమియంను ‘ఇతర మార్గాల ద్వారా సమకూరే ఆదాయం’గా పరిగణించి 30 శాతం వరకూ పన్ను విధించాలి. అయితే డీపీఐఐటీ వద్ద రిజిస్టర్ అయిన స్టార్టప్లను కొత్త నిబంధనల నుంచి మినహాయించారు.
అన్లిస్టెడ్ సార్టప్లు జారీచేసే కంపల్సరీ కన్వర్ట్బుల్ ప్రిఫరెన్స్ షేర్లు (సీసీపీఎస్), ఈక్విటీ షేర్ల విలువ మదింపు.. వాటి సబబైన మార్కెట్ విలువ ఆధారంగా జరగాలని సీబీడీటీ పేర్కొంది. ఇందుకోసం ఐదు రకాల పద్ధతుల్ని సీబీడీటీ తాజా నోటిఫికేషన్లో వివరించింది. అవి..1.కంపేరబుల్ కంపెనీ మల్టీపుల్ మెథడ్ 2. ప్రాపబిలిటీ వెయిటెడ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మెథడ్ 3. ఆప్షన్ ప్రైసింగ్ మెథడ్ 4. మైల్స్టోన్ అనాలిసిస్ మెథడ్ 5. రీప్లేస్మెంట్ కాస్ట్ మెథడ్. దేశీయ, ప్రవాస ఇన్వెస్టర్లకు జారీచేసే అన్కోటెడ్ షేర్లకు సరసమైన మార్కెట్ విలువను మదింపు చేయడానికి ఉద్దేశించిన రూల్ 11 యూఏను సీబీడీటీ సవరించి, కొత్తగా ఐదు పద్దతుల్ని ప్రవేశపెట్టిందని ఎస్డబ్ల్యూ ఇండియా మేనేజింగ్ పార్టనర్ అతుల్ పురి చెప్పారు.
రూల్ 11యూఏ కింద దేశీయ ఇన్వెస్టర్లకు అన్కోటెడ్ షేర్ల వాల్యుయేషన్ కోసం ప్రస్తుతం రెండు విధానాలు-డీసీఎఫ్ (డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో) మెథడ్, ఎన్ఏవీ (నెట్ అసెట్ వాల్యూ) మెథడ్ వర్తిస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లకు జారీ అయ్యే షేర్ల విలువ గణింపుపై ప్రస్తుత రూల్ 11యూఏలో ఎటువంటి ప్రస్తావనా లేనందున పన్ను అధికారులు, ప్రవాస ఇన్వెస్టర్ల మధ్య లిటిగేషన్లు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రూల్ 11యూఏను సవరించి డీసీఎఫ్, ఎన్ఏవీ మెథడ్స్కు అదనంగా విదేశీ ఇన్వెస్టర్లకు మరో ఐదు వాల్యుయేషన్ మెథడ్స్ లభ్యమవుతాయని పురి వివరించారు. వీటి మదింపు విలువును 10 శాతం అటూఇటూగా ఉన్నా అనుమతిస్తారు. అయితే ఈ ఐదు పద్ధతులు దేశీయ ఇన్వెస్టర్లకు వర్తించబోవన్నారు. సీసీపీఎస్ల జారీపై విధించే పన్నులపై తాజా సవరణల ద్వారా స్పష్టతనివ్వడం విదేశీ ఇన్వెస్టర్లకు ఊరటకల్పించే అంశమని ఇందూస్లా పార్టనర్ శ్రుతి కేపీ చెప్పారు.