Anand Mahindra | పెట్టుబడులు, ట్రేడింగ్లో ఇప్పుడు క్రిప్టో కరెన్సీల హవా సాగుతున్నది. నకిలీ వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఈ నకిలీ వార్తల బారిన మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా పడ్డారు. ఆయన క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టారని… క్రిప్టోల్లో పెట్టుబడుల ద్వారా వేగంగా డబ్బు సంపాదనకు సలహాలు కూడా ఇచ్చారని వార్తలొచ్చాయి. వీటిపై ఆనంద్ మహీంద్రా రియాక్టయ్యారు.
తాను క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టినట్లు వచ్చిన వార్తలు తనను దిగ్భ్రాంతికి గురి చేశాయని, ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీలో రూపాయి పెట్టుబడి కూడా పెట్టలేదని ట్వీట్ చేశారు. ఈ మేరకు ఓ ఆన్లైన్ మీడియా సంస్థలో వచ్చిన కథనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇది పూర్తిగా అనైతికం.. ఈ వార్త గురించి కొందరు నన్ను అప్రమత్తం చేశారని తెలిపారు.
ఆన్లైన్ మీడియా సంస్థల్లో వచ్చిన ఈ వార్త పూర్తిగా కల్పితం.. మోసపూరితం. ఫేక్ న్యూస్ వ్యాప్తిలో కొత్త పంథా అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో చురుగ్గా స్పందించే ఆనంద్ మహీంద్రాపై ఇంతకుముందు కూడా ఫేక్ న్యూస్ వచ్చాయి. పాఠశాల విద్యార్థులకు స్టాక్ మార్కెట్ పాఠాలు చెప్పాలని సెప్టెంబర్లో ఆయన చెప్పినట్లు వచ్చిన ఓ వార్త నెట్టింట వైరలైంది. కానీ అటువంటి సూచనేదీ తాను చేయలేదని తోసిపుచ్చారు.