Amitabh Bachchan | బిగ్ బీ.. అమితాబ్ బచ్చన్ పరిచయం అక్కర్లేని పేరు.. బాలీవుడ్లో అలనాటి నుంచి ఇప్పటి వరకూ సినిమాల్లోనూ, టీవీ షోల్లోనూ పాపులర్.. బాలీవుడ్ సూపర్ స్టార్ ఇప్పుడు అయోధ్యలోని సెవెన్ స్టార్ ఎంక్లేవ్లో ప్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ట జరుగనున్న రామాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో అమితాబ్ ఈ ప్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ముంబై కేంద్రంగా పని చేస్తున్న రియాల్టీ డెవలపర్ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (హెచ్ఓఏబీఎల్) వద్ద బిగ్ బీ ఈ ప్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. అయితే, ఆ ప్లాట్ విలువ ఎంత, సైజ్ ఎంత సంగతి వెల్లడించడం లేదు. కానీ ప్లాట్ విస్తీర్ణం సుమారు 10 వేల చదరపు అడుగులు ఉంటుందని, దాని విలువ రూ.14.5 కోట్లు ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.
వచ్చే సోమవారం (జనవరి 22) నాడు.. అయోధ్యలో రామాలయం ప్రాణప్రతిష్ట జరిగే రోజే సరయు నది ఒడ్డున 51 ఎకరాల విస్తీర్ణంలో గల ఈ ఎంక్లేవ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. రామాలయానికి 15 నిమిషాలు, అయోధ్య వాల్మికీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 నిమిషాల్లో వెళ్లేంత దూరంలోనే ఈ ఎంక్లేవ్ ఉందని తెలుస్తోంది. 2028 మార్చికల్లా పూర్తయ్యే ఈ ఎంక్లేవ్లో ఓ ఫైవ్ స్టార్ ప్యాలెస్ హోటల్ కూడా ఉంటుందని రియాల్టీ డెవలపర్ చెబుతున్నారు.
‘అయోధ్యలో సరయూ నది ఒడ్డున హౌస్ ఆఫ్ అభినందన్ లోధా ఎంక్లేవ్లో నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నా. నా హ్రుదయంలో అయోధ్య నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. అవిశ్రాంత ఆధ్యాత్మికత, సుసంపన్న సంస్క్రుతి సంప్రదాయాలకు నిలయమైన అయోధ్యతో భావోద్వేగ భరితమైన అనుబంధం ఉంటుంది’ అని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బిగ్ బీ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ (ఇంతకుముందు అలహాబాద్)లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ జన్మించారు. అక్కడి నుంచి అయోధ్యకు ప్రయాణించడానికి నాలుగు గంటల సమయం పడుతుంది.
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రానికి అయోధ్య చిహ్నంగా మారుతుందని హెచ్ఓఏబీఎల్ చైర్మన్ అభినందన్ లోధా చెప్పారు. తమ ఎంక్లేవ్లో పెట్టుబడి పెట్టిన ఫస్ట్ సిటిజన్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అని తెలిపారు. ఆధ్యాత్మిక వారసత్వానికి మారుపేరుగా నిలిచే అయోధ్యలో ఆర్థిక వ్రుద్ధిరేటుకు అవకాశం ఉందన్నారు.