న్యూఢిల్లీ, మే 17: విజృంభిస్తున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల అత్యవసర ద్రవ్యసమీక్ష నిర్వహించి అనూహ్యంగా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. దీని ప్రభావం బ్యాంకింగ్ రుణాలపై, వాటిని తీసుకున్నవారిపై ఎలా ఉంటున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వడ్డింపు దాదాపు అన్ని రంగాలనూ ప్రభావితం చేసింది. అయితే ద్రవ్యోల్బణం సవాళ్లను ఆర్బీఐ నిజంగా అధిగమించాలనుకుంటే.. చిన్న సర్ఫ్ ఎక్సెల్ సబ్బు ధరల్ని గమనిస్తే చాలు. ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ వేగంగా స్పందించడానికి ఓ డిటర్జెంట్ ఎలా సహాయపడగలదని అనుకుంటున్నారా?.. జనవరిలో దీని ధర 20 శాతానికిపైగా ఎగబాకింది. పేద, మధ్యతరగతి వినియోగదారులే లక్ష్యంగా ఈ సర్ఫ్ ఎక్సెల్ సబ్బుల్ని హిందుస్థాన్ యునీలివర్ కంపెనీ రూ.5, 10 (మ్యాజిక్ ప్రైస్ పాయింట్స్)కి అమ్ముతున్నది. రూపాయి ధర పెరిగినా వీటి సేల్స్ తగ్గిపోతాయి.
కాబట్టే వీటి ధరలు అంత త్వరగా పెరగవు. చివరకు అంతగా నష్టాలు వస్తే.. బరువును కాస్త తగ్గించేందుకైనా కంపెనీలు ఇష్టపడతాయిగానీ ధరలు పెంచవు. అయితే రూ.10 విలువైన సబ్బు రూ.12కు మార్కెట్లో అమ్ముడవుతున్నది. ఇలా ఇతర ఉత్పత్తుల ధరల్లోనూ తేడాలున్నాయి. దీంతోనే అన్ని స్థాయిల్లో ద్రవ్యోల్బణం తీవ్రతపై అప్రమత్తమైన ఆర్బీఐ.. అత్యవసర ద్రవ్యసమీక్ష చేపట్టి రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. అంటే చిన్నచిన్న ఉత్పత్తుల రిటైల్ ధరల ఆధారంగానే ఆర్బీఐ ద్రవ్యసమీక్షల్లో నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని స్పష్టంగా తెలుస్తున్నది. కేవలం సబ్బులే కాదు మార్కెట్లో జనాదరణ కలిగిన ఇతర వస్తువుల ధరలూ ద్రవ్యపాలసీని ప్రభావితం చేస్తాయి. ఇదీ.. మ్యాజిక్ ప్రైస్ పాయింట్స్ ఆర్బీఐకి చేసే హెచ్చరికలు.