Ambassador in New Avatar | `వీల్స్ ఆఫ్ ఇండియా`గా పేరొందిన ఐకానిక్ `అంబాసిడర్` కారు కొత్త రూపుతో కస్టమర్లకు కనువిందు చేస్తూ.. ఎలక్ట్రిక్ కారుగా ఆటోమొబైల్ రంగాన్ని మళ్లే ఏలేందుకు సిద్ధం అవుతన్నది. `అంబీ` అనే పేరుతో రెండేండ్లలో నూతన అవతారంలో భారత్ మార్కెట్లపై పరుగులు తీయబోతున్నది. ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ పౌగోట్, హింద్ మోటార్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఎంఎఫ్సీఐ) పరస్పర సహకారంతో అంబాసిడర్ లేదా `అంబీ` మోడల్ ఇంజిన్ను డిజైన్ చేశాయి. త్వరలో మార్కెట్లో ఆవిష్కరించబోతున్నారు.
సీకే బిర్లా గ్రూప్ అనుబంధ హెచ్ఎంఎఫ్సీఐ నిర్వహిస్తున్న హిందూస్థాన్ మోటార్స్ (హెచ్ఎం) చెన్నై ప్రొడక్షన్ యూనిట్లో ఈ నూతన అంబీ కారును ఉత్పత్తి చేస్తారు. అంబీ కారు న్యూ ఇంజిన్ డిజైనింగ్ అడ్వాన్స్ దశకు చేరుకుందని హిందూస్థాన్ మోటార్స్ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ తెలిపారు. సుదీర్ఘ కాలంగా భారత్ మార్కెట్లోకి రావాలని పౌగోట్ ప్రయత్నిస్తున్నది.
ఒకనాడు స్టేటస్కు మారుపేరు… సర్కారీ గాడీగా.. అధికార యంత్రాంగం నడిపే కారుగా గుర్తింపు పొందింది అంబాసిడర్. బిర్లా కుటుంబంపై రాజకీయ ప్రభావం ఎక్కువే. 1954లో స్వదేశీ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రోత్సహించడానికి నాటి ప్రభుత్వ విధానాలను అనుసరిస్తూ తయారు చేసిన అంబాసిడార్ సర్కార్ గాడీగా ప్రసిద్ధి చెందింది.
కాంపిటీటీవ్ సంస్థలతో పోలిస్తే అంబాసిడర్ కార్లలో ప్రీమియర్ పద్మినీ, స్టాండర్డ్ 10 పరిమాణం విశాలంగానూ.. రఫ్గా ఉండటంతో భారత రోడ్లపై దశాబ్ధాల తరబడి రారాజుగా కొనసాగింది. అంబాసిడర్ కారును ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా వాడే వారు. రాజకీయ నేతలు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ధనవంతులు వాడటంతో ఇది ఆటోమొబైల్ రంగ మార్కెట్నే శాసించింది.
1960వ దశకం మొదలు 1990వ దశకం మధ్య వరకు దేశంలో అంబాసిడర్.. భారతీయులకు ఒక స్టేటస్ సింబల్. ఏకైక సామూహిక లగ్జరీ కారు ఇది. 1991లో సరళీకరణ తర్వాత క్రమంగా అంబాసిడర్ కారు కనుమరుగైంది. కానీ 1980ల ప్రారంభంలో ఖర్చెక్కువ, మైలేజ్ తక్కువ కావడంతోపాటు నాసికరం అంబాసిడర్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. అదే సమయంలో మారుతీ 800 వంటి వేరియంట్లు దేశ మార్కెట్లోకి వచ్చాయి ధర తక్కువ కావడం, మైలేజ్, ట్రెండ్కు తగ్గట్లు మోడళ్లు మార్కెట్లోకి రావడంతో అంబాసిడర్కు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది.
ఏటా 20 వేలకు పైగా వాహనాలు అమ్ముడయ్యే అంబాసిడర్.. 1980వ దశకం మధ్యలోకి వచ్చేసరికి రెండువేలకు పరిమితమయ్యాయి. క్రమంగా అమ్మకాలు పడిపోవడంతో 2013-14లో పూర్తిగా ఉత్పత్తి నిలిపేశారు. ప్రగతిలో ఎత్తు పల్లాలను చూసి చివరకు కనుమరుగైన అంబాసిడర్.. ఇప్పుడు అంబీ పేరిట రూపం మార్చుకుని ప్రజల ముంగిట్లోకి వస్తున్నది.
ఇంతకుముందు హిందూస్థాన్ మోటార్స్ చెన్నై ప్లాంట్లో మిత్సుబిషి కార్లు తయారు చేసేవారు. ఉత్తర్పారా సైట్ పూర్తిగా అంబాసిడర్ కారు ఉత్పత్తికే వినియోగించేవారు. 2014 సెప్టెంబర్లో చివరి అంబాసిడర్ కారును ఉత్పత్తి చేసింది. భారీ రుణ భారానికి తోడు డిమాండ్ లేకపోవడంతో 2014లో ఉత్పత్తి నిలిపేశారు. అంబాసిడర్ బ్రాండ్ను 2017లో హిందూస్థాన్ మోటార్స్ ఓనర్స్ సీకే బిర్లా గ్రూప్.. ఫ్రాన్స్ ఆటోమేకర్ పౌగోట్కు రూ.80 కోట్లకు విక్రయించేసింది.