న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ‘అమెజాన్ మమ్మల్ని నాశనం చేయాలనుకున్నది. అనుకున్నంత పనీ చేసింది’ అని సుప్రీం కోర్టులో ఫ్యూచర్ రిటైల్ ఆవేదన వ్యక్తం చేసింది. రోజుల తరబడి కొనసాగుతున్న ఈ న్యాయపోరాటంతో తీవ్రంగా నష్టపోయామని తెలిపింది. అమెజాన్-ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ వివాదం కేసులో శుక్రవారం తదుపరి విచారణను ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, న్యాయమూర్తులు మురారీ, హిమా కోహ్లీలతో కూడిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. అంతకుముందు ఫ్యూచర్ రిటైల్ మాట్లాడుతూ.. ‘మేము ఉరికొయ్యపై వేలాడుతున్నాం. మాతో ఇప్పుడు ఎవరూ వ్యాపారం చేసేందుకు సిద్ధంగా లేరు. 835కుపైగా స్టోర్లను కోల్పోయాం. మిగిలిన 374 స్టోర్లనే నడుపుతున్నాం’ అని తెలిపింది. రిలయన్స్ తమ స్టోర్లను స్వాధీనపర్చుకోవడంపైనా స్పందిస్తూ ఒకింత నిస్సహాయతనే ఫ్యూచర్ రిటైల్ వ్యక్తం చేసింది. మరోవైపు ఫ్యూచర్ రిటైల్, రిలయన్స్లది మోసమని అమెజాన్ దుయ్యబట్టింది. కాగా, రుణదాతలకు రూ.5, 322.32 కోట్లను సకాలంలో చెల్లించలేకపోయామని ఫ్యూచర్ తెలిపింది.